NewsInn

News in a Click

హైద‌రాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయండి… సీఎం రేవంత్

హైద‌రాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయండి… సీఎం రేవంత్

న‌వోద‌య,కేంద్రీయ‌ విద్యాల‌యాలు ఏర్పాటు చేయండి

కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌కు విన‌తి

(న్యూఢిల్లీ, న్యూస్ఇన్‌)

హైదరాబాద్‌లో ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) మంజూరు చేయాల‌ని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరో స్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ముందున్న హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిన అవ‌సరం ఉంద‌ని సీఎం తెలిపారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌తో పార్ల‌మెంట్‌లోని ఆయ‌న ఛాంబ‌ర్‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం భేటీ అయ్యారు. దేశంలో 19 రాష్ట్రాల్లో, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపి 21 ఐఐఎం లు ఉన్నాయ‌ని, తెలంగాణ రాష్ట్రంలోనూ ఐఐఎం ఏర్పాటు చేయాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణంలో గుర్తించామ‌ని సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. ఐఐఎం తరగతులు వెంట‌నే ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉంద‌ని కేంద్ర మంత్రి సీఎం వెల్ల‌డించారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వెంటనే మంజూరు చేయడంతో పాటు అవసరమైన వసతులు కల్ప‌న‌కు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు సీఎం తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా హైదరాబాద్ కు ఎయిర్, రైల్, రోడ్ కనెక్టివిటీ ఉంద‌ని, అనుకూల వాతావ‌ర‌ణం, భిన్న రంగాల ప్ర‌ముఖుల‌ను అంద‌జేసిన చ‌రిత్ర హైదరాబాద్‌కు ఉంద‌ని కేంద్ర మంత్రికి సీఎం తెలియ‌జేశారు. హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేస్తే అది తెలంగాణ రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లల అవకాశాలను మెరుగుపర్చుతుంద‌ని సీఎం అన్నారు. పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా నూత‌నంగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాల‌ని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. పెరుగుతున్న పట్టణీకరణ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు అవసరం ఉంద‌ని సీఎం అన్నారు.

కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో భేటీ అయిన ముఖ్యంత్రి ఎ.రేవంత్ రెడ్డి

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ (YIIRS) ఏర్పాటుకు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో 105 YIIRSలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రికి తెలిపారు. YIIRSల‌తో ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా 4 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు మెరుగైన విద్య అందుతుంద‌ని
వీటి నిర్మాణం, ఇత‌ర విద్యా సంస్థ‌ల ఏర్పాటుకు రూ.30 వేల కోట్ల వ్య‌య‌మ‌వుతుంద‌ని కేంద్ర మంత్రికి
సీఎం తెలియ‌చేశారు. ఈ మొత్తానికి తీసుకునే రుణాల‌కు ఎఫ్ఆర్‌బీఎం నుంచి మిన‌హాయించాల‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ను సీఎం కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *