పోలీసుల తీరుపై కేటిఆర్ తీవ్ర ఆగ్రహం
(హైదరాబాద్, న్యూస్ఇన్)
పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడుఉ చేస్తున్నారని, కాంగ్రెస్ నేతల తీరు మారకపోతే దాడికి ప్రతిదాడి తప్పదని బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్
హెచ్చరించారు. పోలీసుఉ కూడా అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలదాడిలో గాయపడిన ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన నేతల వైద్య ఖర్చులు పార్టీనే భరిస్తుందని భరోసా ఇచ్చారు.సోమార్పేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి, సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకులు బిట్ల బాలరాజు, ఆయన భార్య గంజి భారతిలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సోమవారం పరామర్శించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్తో కలిసి ఆసుపత్రికి వెళ్లిన కేటీఆర్, బాధితుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడ్డ గంజి భారతి గారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. “ఆమె పెల్విస్ ఎముకలు విరిగిపోయాయని, యూరినరీ బ్లాడర్ దెబ్బతిన్నదని డాక్టర్లు తెలిపారు. ఆమెకు మూడు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉందని, కనీసం మూడు వారాల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది” అని ఆయన పేర్కొన్నారు.
పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్

రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా, అమానవీయంగా ఉందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “డీజీపీ నుండి కింది స్థాయి పోలీసు అధికారుల వరకు అందరికీ గుర్తుచేస్తున్నా… మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతోనే తప్ప, రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ముతోనో, కాంగ్రెస్ పార్టీ సొమ్ముతోనో కాదు. ప్రజల ప్రాణాలు పోతుంటే, రౌడీలు దాడులు చేస్తుంటే పోలీసులు చేష్టలుడిగి చూడటం పద్ధతి కాదు” అని హెచ్చరించారు.
దాడికి ప్రతిదాడి తప్పదు
పోలీసులు నిశ్చేష్టులుగా వ్యవహరిస్తూ, నిందితులపై చర్యలు తీసుకోకపోతే తాము కూడా తిరగబడాల్సి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. “ఇక దాడికి ప్రతిదాడే సమాధానం అనుకుంటే, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది. అప్పుడు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి” అని హెచ్చరించారు.
అటెంప్ట్ టు మర్డర్ కేసులు: భారతి, బాలరాజులపై దాడి చేసిన వారితో పాటు, దాడికి ప్రేరేపించిన వారిపై కూడా హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాడిలో గాయపడ్డ వారికి తక్షణమే ఆర్థిక సహాయం అందించాలన్నారు.
కాంగ్రెస్ అరాచకాలపై ధ్వజం
గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడుతోందని కేటీఆర్ ఆరోపించారు. నల్గొండలో మల్లయ్య యాదవ్ హత్య, సూర్యాపేటలో బీసీ అభ్యర్థిని కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన ఘటనలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు.






Leave a Reply