NewsInn

News in a Click

ఏపీలో విభిన్న వాతావ‌రణం జాగ్ర‌త‌…..!

ఏపీలో విభిన్న వాతావ‌రణం జాగ్ర‌త‌…..!

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు.ఆదివారం నెల్లూరు జిల్లా గూడూరులో ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రత 46.2, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 46.1 డిగ్రీలు రికార్డయ్యాయని ఆయన పేర్కొన్నారు. కడప జిల్లాలో 33 మండలాలు, నెల్లూరు 33, తిరుపతి 31, ప్రకాశం 28, పల్నాడు 25, మార్కాపురం 21, నంద్యాల 20, చిత్తూరు 20, కర్నూలు 18, బాపట్ల 16 మండలాలు మొత్తంగా 28 జిల్లాలకు గాను 16 జిల్లాల పరిధిలోని 286 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపి 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

మరోవైపు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా కొమోరియన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఎపిఎస్డీఎంఎ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ ప్రభావంతో సోమవారం అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు,శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి, పోలవరం,విశాఖ, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.

ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికి కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 72.7మిమీ, కాట్రేనికోనలో 57.7మిమీ, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 50.2మిమీ, పిఠాపురంలో 45.5మిమీ, కాకినాడ రూరల్ 43మిమీ, అచ్చుతాపురంలో 42మిమీ, కాకినాడ అర్బన్ 41మిమీ వర్షపాతం నమోదైందని తెలిపారు. సోమ‌వారం కూడా రాష్ట్రంలోని దాదాపు 30 మండ‌లాల్లో వ‌డ‌గాలుల ప్ర‌భావం ఉండే అవ‌కాశం ఉంద‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *