NewsInn

News in a Click

గ‌వ‌ర్న‌ర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో వచ్చే జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సందర్భంగా పొగాకు, మద్యం, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ శివ‌ ప్రతాప్ శుక్లా కు తెలిపారు. ముఖ్యమంత్రి లోక్‌భవన్‌లో గవర్నర్ గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు వివిధ వస్తువులతో కూడిన కిట్లను అందజేస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించడం, కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి ఈ సందర్భంగా గవర్నర్ గారిని ఆహ్వానించారు. ఈ కిట్లలో యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్త‌కాలు, స్కూల్‌ బ్యాగ్‌, క్రీడా దుస్తులు, విద్యార్థులకు అవ‌స‌ర‌మైన ఇత‌ర సామగ్రి ఉంటాయ‌ని గ‌వ‌ర్న‌ర్ కు వివరించారు. ఆయా పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో విద్యార్థులు డ్రగ్స్, వ్య‌స‌నాల బారిన ప‌డ‌కుండా అప్ర‌మ‌త్తంగా ఉండేలా యాజ‌మాన్యాలు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. పాఠశాల విద్యాశాఖ, పోలీసు శాఖ, ఈగ‌ల్‌ (EAGLE) సంయుక్త ఆధ్వ‌ర్యంలో సామూహిక ప్ర‌తిజ్ఞ‌, ఇత‌ర కార్య‌క్ర‌మాలు చేపట్టనున్నారు. విద్యా సంస్థ‌ల‌ను సుర‌క్షితంగా, డ్ర‌గ్స్ ర‌హితంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యాజ‌మాన్యాల సమ‌ష్టి బాధ్యతపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *