NewsInn

News in a Click

ప్రభుత్వ సేవలు మరింత సులభతరం:చంద్ర‌బాబు

ప్రభుత్వ సేవలు మరింత సులభతరం:చంద్ర‌బాబు

(అమరావతి, న్యూస్ఇన్‌)

ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు. ఈ మేరకు ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించే అంశంపై అధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు సేవల్ని సులభతర ప్రక్రియను మొదలు పెట్టామని.. ముందుగా 11 రకాల సేవల్లో ప్రక్రియలను కుదిస్తున్నామని అధికారులు తెలిపారు. అలాగే ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఆన్‌లైన్లో ఫిర్యాదులు చేసే అవకాశాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు… మనమిత్ర వాట్సాప్‌లో కూడా ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించాలన్నారు. వాయిస్ మెసేజెస్ పెట్టినా వాటిని కూడా ఫిర్యాదులుగా స్వీకరించేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు.

రాష్ట్రంలో మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో సుమారు 3 వేల ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని.. మూడు నెలల్లో సమస్య పరిష్కరించాలన్నారు. ఈ మేరకు నెట్‌వర్క్ సంస్థలతో మాట్లాడాలని సూచించారు. నవచేతన పేరుతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ చేపట్టిన ఎర్లీ చైల్డ్ హుడ్ డెవలప్మెంట్ స్క్రీనింగ్ విధానంపై సమావేశంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పిల్లల ఎదుగుదల, వారి మానసిక, శారీరక పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్టు అధికారులు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 33,949 మంది పిల్లలను స్క్రీన్ చేసినట్టు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేవారితో పాటు ఇళ్లకు కూడా వెళ్లి స్క్రీనింగ్ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్పారు. స్క్రీనింగ్‌తో పాటు… ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై పైలెట్ ప్రాజెక్ట్ అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

తక్షణ పరిష్కారాలు చూపండి….

సీఎం సూచనల మేరకు క్షేత్రస్థాయి పర్యటనల విషయంలో సర్క్యులర్ జారీ చేశామని అధికారులు తెలిపారు. ఈ మేరకు నెలలో సెక్రటరీలు 3 రోజులు, హెచ్‌ఓడీలు 6 రోజులు, జిల్లా కలెక్టర్లు 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సర్కులర్ జారీ చేసినట్టు అధికారులు వివరించారు. సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తక్షణ పరిష్కారాలు చూపాలని సీఎం ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *