NewsInn

News in a Click

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై BRS ఫోక‌స్

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై BRS ఫోక‌స్

(హైద‌రాబాద్, న్యూస్ఇన్‌)

హైదరాబాద్ జిల్లా పార్టీ ప్రజా ప్రతినిధులతో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, ఎమ్మెల్యేలు ముటా గోపాల్, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శ్రీమతి వాణిదేవి మరియు ఇతర నియోజకవర్గాల ఇంచార్జీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ప్రధానంగా ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్” పేరిట ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రతి నియోజకవర్గానికి అత్యంత కీలకమని, దీనిని పార్టీ శ్రేణులు సీరియస్ గా తీసుకొని పకడ్బందీ కార్యాచరణతో ముందుకు వెళ్లాలని కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు.

ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలని, ముఖ్యంగా కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీలు ఇప్పటికే నమోదు చేసిన దొంగ ఓట్లను, డబుల్ ఓట్లను గుర్తించి వాటిని తొలగించేలా చర్యలు చేపట్టాలని కేటీఆర్ ఆదేశించారు. గత జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లోనే పదుల సంఖ్యలో ఓట్లు నమోదు కావడం, వేల సంఖ్యలో ఇతర నియోజకవర్గాల ఓట్లు ఉండటం వల్ల పార్టీ పరాజయానికి దారి తీసిన ఉదంతాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నగరంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా పార్టీ తరఫున అండగా నిలవాలని, నూతన ఓటర్ల నమోదు ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు చొరవ చూపాలని ఆయన సూచించారు.

హైదరాబాద్ జిల్లా పరిధిలో ఈ ఓటర్ల సవరణ కార్యక్రమ బాధ్యతలను మరియు పర్యవేక్షణను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షిస్తారని కేటీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ప్రతి ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ ఇంచార్జ్ ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని కోరారు. బూత్ స్థాయిలో చురుకైన కార్యకర్తలను వెంటనే “బూత్ లెవల్ అసిస్టెంట్స్” (BLA) గా గుర్తించి, ఆ జాబితాను ప్రభుత్వ సిబ్బందికి మరియు కేంద్ర పార్టీ కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు. త్వరలోనే బూత్ లెవల్ ఏజెంట్లకు నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, ఈ ప్రక్రియలో నేతలకు ఎలాంటి మద్దతు అవసరమైనా తాము స్వయంగా అందిస్తామని తలసాని భరోసా ఇచ్చారు. నగర రాజకీయాల్లో ఓటర్ల జాబితా గెలుపు ఓటములను శాసిస్తుందని, అందుకే ఈ కార్యక్రమంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *