(హైదరాబాద్,న్యూస్ఇన్)
సామాన్యుడి మెరుగైన జీవన ప్రమాణాలుగా అందాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకోసం సీఎస్ఐఆర్-ఐఐసీటీ నిరంతరం అగ్రగామిగా నిలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. తద్వారా ప్రపంచంలో భారత్ అగ్రస్థానానికి చేరుకునే ప్రయాణంలో ఈ సంస్థ తనదైన ముద్ర వేస్తుందన్నారు. భారత్ సాంకేతికతను అనుకరించే దేశం స్థాయి నుంచి వినూత్న ఆవిష్కరణలకు రూపుదిద్దగలదిగా పురోగమిస్తోందని చెప్పారు. ఆర్థిక వృద్ధి, వ్యూహాత్మక స్వావలంబన, ప్రపంచ పోటీతత్వం దిశగా విజ్ఞాన శాస్త్రం శక్తియుత సారథిగా ఆవిర్భవిస్తోందని ఆయన స్పష్టం చేశారు.దేశంలో వ్యవసాయ రంగంలో అపార సామర్థ్యం ఉందని, దీన్ని ఇంకా పూర్తిస్థాయిలో మనం వినియోగించుకోవడం లేదని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ శాస్త్రవిజ్ఞాన ప్రాధాన్యాలు పంటల మెరుగుదలకే పరిమితం కావడం లేదని చెప్పారు. వ్యవసాయ వ్యర్థాలను, పంటల అవశేషాలను విలువైన ఉత్పత్తులుగా మార్చే సాంకేతిక పరిజ్ఞానాల రూపకల్పన దిశగానూ ప్రభుత్వం ప్రాముఖ్యం ఇస్తున్నదని చెప్పారు. తద్వారా రైతులు, పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలు అంది వస్తున్నాయని తెలిపారు.

హైదరాబాద్లోని ‘సీఎస్ఐఆర్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (సీఎస్ఐఆర్-ఐఐసీటీ) ప్రాంగణంలో శంకుస్థాపన, ప్రారంభోత్సవాల అనంతరం డాక్టర్ జితేంద్ర సింగ్ శాస్త్రవేత్తలనుద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ఫ్లోరోకెమికల్స్ కోసం అధునాతన పరిశోధన-అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే, సిరిపురం చేనేత సముదాయం కోసం 500 ‘కేఎల్డీ’ వికేంద్రీకృత వ్యర్థజల శుద్ధి కర్మాగారాన్ని, పారిశ్రామిక రసాయనాల కోసం నిరంతర ప్రాసెసింగ్ వేదిక సహా సుస్థిర ఇంజనీరింగ్ కాంప్లెక్స్ను ప్రారంభించారు.
పరిశోధనలను ఆర్థిక విలువగా మార్చడంలో శాస్త్రవిజ్ఞాన సంస్థలు పరిశ్రమలతో చేయి కలపడం అత్యావశ్యకమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. భాగస్వామ్యాలతో నిమిత్తం లేని ప్రయోగశాలలకు నేటి కాలంలో తావుండదని వ్యాఖ్యానించారు. ఆవిష్కరణలు, వాణిజ్యీకరణ తదితరాలను వేగిరపరచాలంటే పరిశ్రమలు, ‘ఎంఎస్ఎంఈ’లు, అంకుర సంస్థలు, సాంకేతిక భాగస్వామ్య సంస్థలతో కలిసి కట్టుగా నడువాల్సిందేనని స్పష్టం చేశారు.

ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని ప్రస్తావిస్తూ- మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం నుంచి వ్యవసాయ వ్యర్థాల ఉత్పాదక వినియోగం దాకా మొత్తం విలువ వ్యవస్థలో శాస్త్రీయ పరిశోధన, విలువ జోడింపు, గ్రామీణ వ్యవస్థాపన, సుస్థిర పారిశ్రామిక వృద్ధికి కొత్త అవకాశాలు అందిస్తాయన్నారు. ‘సీఎస్ఐఆర్-ఐఐసీటీ’ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస రెడ్డి సహా ‘సీఎస్ఐఆర్-సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కె.నందికూరి, ‘సీఎస్ఐఆర్-ఎన్జీఆర్ఐ’ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ కుమార్, ‘సీఎస్ఐఆర్-నీరి’ డైరెక్టర్ డాక్టర్ ఎస్.వెంకట మోహన్, ‘సీడీఎఫ్డీ’ డైరెక్టర్ ప్రొఫెసర్ ఉల్లాస్ కొల్తూర్ సీతారామ్ తదితరులు హాజరయ్యారు. సీఎస్ఐఆర్-ఐఐసీటీ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సిబ్బందిని డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. పరిశ్రమలతో తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని, యువ పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకులుగా నిలవాలని, ప్రయోగశాలలో పుట్టే ప్రతి అద్భుతమైన ఆవిష్కరణ మార్కెట్లోకి చేరేలా చూడాలని ఆయన వారిని మంత్రి కోరారు.












Leave a Reply