(నల్గొండ,న్యూస్ఇన్)
బీఆర్ఎస్ త్యాగం అంటే ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్ అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. త్యాగం అంటే 1969లో పదవిని వదులుకున్న కొండ లక్ష్మణ్ బాపూజీది అని, మలి దశ ఉద్యమంలో పదవీ త్యాగం చేసింది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిది అసలైన త్యాగమని తెలిపారు. వందల మంది త్యాగాలు చేసి తెలంగాణ సాధిస్తే.. ఆ త్యాగాన్ని బీఆర్ఎస్ వాళ్లు తమ ఖాతాలో నిస్సిగ్గుగా వేసుకున్నారని ధ్వజమెత్తారు. పెట్రోల్ పోసుకుని ప్రాణార్పణ చేసిన శ్రీకాంతా చారిని ఏమనాలని అన్నారు. ఏ పదవులు ఆశించకుండా ప్రాణాలర్పించిన వారివి త్యాగాలు కావా అని ప్రశ్నించారు. ఇక వంద రూపాయాల పెట్రోల్ మీద పోసుకున్న అగ్గిపెట్టెరావుది త్యాగం కాదని, వేల కోట్లు దోచుకున్నారంటూ పరోక్షంగా హరీశ్ రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వందేళ్ల విధ్వంసం చేసింది కల్వకుంట్ల ఫ్యామిలీ అని కామెంట్ చేశారు.

తోడేళ్లలా ఇద్దరు తెలంగాణలో తిరుగుతున్నారంటూ కేటీఆర్, హరీశ్ రావులను ఉద్దేశించి ఫైర్ అయ్యారు. ఏది ఏమైనా ప్రజా పాలనకు నాలుగు కోట్ల ప్రజల ఆశీర్వాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సీఎం అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ బీఆర్ ఎస్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పదేళ్లు పదవులు అనుభవించి రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు శాశ్వతంగా బహిష్కరించారని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఎంతోమంది త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధిస్తే.. పదవులు మాత్రం కేసీఆర్ కుటుంబం అనుభవించిందని విమర్శించారు. ఆ కుటుంబానికి మళ్లీ అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు.

మూసీ ప్రక్షాళన ఆగదు…..
మూసీ కాలుష్యం తమ పాలిట విషంగా మారిందని నల్గొండ జిల్లా ప్రజలు బాధపడుతున్నారు. మూసీ నదిని శుద్ధి చేసి ప్రజలకు మేలు చేస్తామంటే దాన్ని కూడా పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఎవరు అడ్డువచ్చినా మూసీ ప్రక్షాళన ఆగదు. ఫాంహౌస్లో మెషిన్లు పెట్టుకుని భార్యాభర్తల ఫోన్లు కూడా దొంగచాటుగా విన్నారు. నిజాలు మాట్లాడే అలవాటు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుకు ఏనాడూ లేదు. ఆ పాపాల భైరవుడు మళ్లీ అధికారంలోకి రావాలని ఇద్దరు నేతలు తిరుగుతున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చ పెడతాం. దానికి సిద్ధమా? రూ.లక్ష కోట్లతో కేసీఆర్, హరీశ్రావు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలి మూలన పడింది. వైఎస్ఆర్ చేపట్టిన ఎస్ఎల్బీసీని పదేళ్లపాటు కేసీఆర్ పట్టించుకోలేదు. వచ్చే ఎన్నికల్లోపు ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తిచేస్తాం’’ అని రేవంత్రెడ్డి అన్నారు.












Leave a Reply