NewsInn

News in a Click

మూసీ క‌నుమ‌రుగుకు రేవంత్, బీజేపీలు కుట్ర:కేటిఆర్

మూసీ క‌నుమ‌రుగుకు రేవంత్, బీజేపీలు కుట్ర:కేటిఆర్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

కాంగ్రెస్, బీజేపీలు కలిసి భవిష్యత్ తరాలకు మూసీ నదిని లేకుండా చేస్తున్నాయని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఒకవైపు మూసీ ప్రక్షాళన చేస్తామని మాటలు చెబుతున్న రేవంత్ రెడ్డి, మూసీ జన్మస్థానమైన వికారాబాద్ జిల్లాలో 12 లక్షల చెట్లను, అడవులను నరికివేసి, అడవులను తొలగించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ప్రజలు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు ఎంత వ్యతిరేకించినా, నేవీ రాడార్ స్టేషన్ పేరిట రెండు వేల ఎకరాలకు పైగా అడవులను తొలగించి, వికారాబాద్ జిల్లా ప్రకృతి స్వరూపాన్ని శాశ్వతంగా మార్చే కుట్ర చేశారని ఆయన ఆరోపించారు.

హైదరాబాద్ విశ్వనగరంగా మారాలని, మెట్రో నగరమైన హైదరాబాద్‌కి అత్యంత చేరువలో ఉన్న ఏకైక హిల్ స్టేషన్ వికారాబాద్ అని, ఇక్కడి అడవుల్లోని గాలికి అనేక వ్యాధులను నయం చేసే శక్తి ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. అలాంటి హిల్ స్టేషన్‌ను, అడవిని ప్రజలకు దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఒకవైపు మూసీని ప్రక్షాళన చేస్తామని చెబుతూనే, మూసీ జన్మస్థానంలో అడవులు లేకుండా చేస్తే మూసీ ఉనికి పూర్తిగా పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్రంలోని మోదీ అడగగానే రాసిచ్చిన ఈ నేవీ రాడార్ స్టేషన్ భూముల్లో అడవుల తొలగింపు వల్ల, మూసీ భవిష్యత్ తరాలకు లేకుండా పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

కాంగ్రెస్ హయాంలో రంగారెడ్డి జిల్లాలోని రైతులకు ఉన్న భరోసా పూర్తిగా పోయిందని, రియల్ ఎస్టేట్ కుప్పకూలడానికి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబం చేస్తున్న అరాచకాలు, కబ్జాలే కారణమని ఆయన ఆరోపించారు. వికారాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ గడ్డం ప్రసాద్, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా అనేక అబద్ధాలు ఆడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయడంలో విఫలమైందని, రైతులతో పాటు సబ్బండ వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పరిపాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఆట ముగిసిందని, తిరిగి అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని, అక్రమాలకు పాల్పడుతున్న పోలీసులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేవలం కేసీఆర్‌కు పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే లక్షలాది మంది రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని కేటిఆర్ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *