(న్యూస్ ఇన్, ఆధ్యాత్మికం)
ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో ప్రతి ఏటా జ్యేష్ఠ పౌర్ణమి రోజున నిర్వహించే స్నానోత్సవానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రపంచ ప్రఖ్యాత రథయాత్రకు ముందు జరిగే ఈ ఉత్సవాన్ని లక్షలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో వీక్షిస్తారు. ఈ వేడుకలో కనిపించే ప్రతి ఆచారం వెనుక సందేశం దాగి ఉందని ఆలయ సంప్రదాయాలు చెబుతున్నాయి.
స్నానోత్సవం రోజున శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి, సుదర్శనుడిని ఆలయం గర్భగుడి నుంచి ప్రత్యేక ఊరేగింపుగా స్నాన మండపానికి తీసుకు వస్తారు. ఈ ఊరేగింపును “పహండి” అని పిలుస్తారు. అనంతరం 108 పవిత్ర కలశాల్లోని సుగంధ జలాలతో స్వామివారికి మహాభిషేకం నిర్వహిస్తారు.అభిషేకం పూర్తైన తర్వాత స్వామివారిని గజానన రూపంలో అలంకరించి భక్తులకు దర్శించుకునేందుకు కల్పిస్తారు. మహారాష్ట్రకు చెందిన ఓ గణపతి భక్తుడి కోరిక మేరకు ఈ గజానన సంప్రదాయం ప్రారంభమైనట్లు పురాణాల్లో పేర్కొంటారు. ఈ దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు పూరీకి తరలివస్తుంటారు.
15 రోజులు దర్శనం రద్దు…..

స్నానోత్సవం అనంతరం ఒక ఆసక్తికరమైన సంప్రదాయం ప్రారంభమవుతుంది. స్నానం చేసిన కారణంగా స్వామివారికి జలుబు, జ్వరం వచ్చినట్లుగా భావించి, ఆయనను ఆలయంలోని అనసార గృహానికి తరలిస్తారు. ఆ సమయంలో 15 రోజుల పాటు భక్తులకు దర్శనం ఉండదు. అనారోగ్యానికి గురైన స్వామి వారికి మూలికా ఔషధాలు, కషాయాలు, తైల మర్దన, పత్యాహారం వంటి ప్రత్యేక సేవలు నిర్వహిస్తారు. ఈ ఆచారం ద్వారా అనారోగ్యం వచ్చినప్పుడు విశ్రాంతి, సరైన ఆహారం, ఔషధ చికిత్స ఎంత ముఖ్యమో ప్రజలకు తెలియజేయడమే ఉద్దేశ్యమని పండితులు చెబుతారు.ఈ 15 రోజుల పాటు స్వామి వారి ప్రధాన విగ్రహాలకు బదులుగా చిత్రపటాలను భక్తులు దర్శించుకుంటారు. అనంతరం స్వామివారు నూతన కాంతితో దర్శనమిచ్చే వేడుకను “నవయౌవ్వన దర్శనం”గా నిర్వహిస్తారు. మరుసటి రోజే ప్రపంచ ప్రసిద్ధ పూరీ రథయాత్ర ప్రారంభమవుతుంది.
స్నానోత్సవం మరో ప్రత్యేకత ఏమిటంటే, ఆలయంలోని కలప విగ్రహాలను పవిత్ర జలాలతో శుభ్రపరచడం ద్వారా వాటి సంరక్షణ కూడా జరుగుతుంది. అలాగే పూరీ శ్రీమందిరానికి అనుబంధంగా ఉన్న రాఘవదాసు మఠం, గోపాల తీర్థ మఠం వంటి సంప్రదాయ మఠాలు ఈ ఉత్సవానికి అవసరమైన పూజా సామగ్రిని సమకూర్చి ఆలయ సంప్రదాయాలను కొనసాగిస్తుంటాయి.ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య పరిరక్షణ, ప్రకృతి అనుకూల జీవన విధానం, అనారోగ్య సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గుర్తుచేసే ఉత్సవంగా జగన్నాథుడి వార్షిక స్నానోత్సవం ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది.








Leave a Reply