(న్యూస్ఇన్, హైదరాబాద్)
“సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ.. ఏదైనా అందరికీ ప్రభుత్వమే యజమాని. ఉద్యోగుల్లో విశ్వాసం, నమ్మకం కలిగించడమే కాకుండా భద్రత కలిపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అడగకపోయినా వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని సీఎం వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం బీమా సౌకర్యం కల్పించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ ఉద్యోగుల బీమా రక్షణ కల్పించడానికి సంబంధించి వివిధ బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలు చేసుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వమంటే ఒక నమ్మకం. ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వర్తించడమంటే సంపూర్ణమైన భద్రత. సింగరేణి కార్మికులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కోటి రూపాయల బీమా కల్పించేందుకు ఉప ముఖ్యమంత్రి ప్రతిపాదించినప్పుడు నమ్మకం కుదరలేదు. కానీ సాధ్యమని నిరూపించారన్నారు. ఏ సంస్థ కోసమైతే రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేస్తున్న కార్మికుడు ఊహించని ప్రమాదంలో చనిపోయినప్పుడు ఆ సంస్థ కోటి రూపాయల సహాయం అందించడానికి అండగా నిలబడినప్పుడు ఆ కుటుంబం సమాజంలో తలెత్తుకుని నిలబడగలుగుతుందన్నారు. మన పట్ల సానుభూతి, సానుకూలత చూపించేవాళ్లు ఉండొచ్చు. కానీ మన సమస్యలకు ఆర్థికంగా సహాయం చేసే వాళ్లు చాలా అరుదు. అందుకే యజమానియే ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

సింగరేణిలో సాధ్యమైనప్పుడు రాష్ట్రంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులకు బీమా సౌకర్యం కల్పించడం ఎందుకు సాధ్యం కాదు. అందుకే అడక్కపోయినా ప్రభుత్వం బాధ్యతతో ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో లావాదేవీలు నిర్వహిస్తున్న 16 బ్యాంకులను ఆహ్వానించి ఉద్యోగుల సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నామని సీఎం చెప్పారు. పదేళ్లలో ధనిక రాష్ట్రమైన తెలంగాణను రూ. 8.11 లక్షల కోట్ల అప్పులు చేసి అనేక సమస్యలను సృష్టించారు. పదేళ్లలో వందేళ్ల విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది. ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత విడతల వారిగా జీతాలు ఇవ్వడం కుదరదని చెప్పి మొదటి తారీఖునే చెల్లిస్తున్నాం. 58 సంవత్సరాల రిటైర్మెంట్ వయసును 61 సంవత్సరాలు పెంచడం వల్ల రిటైర్మెంట్లన్నీ 2024 నుంచి మొదలయ్యాయి. ప్రతి నెలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పేరుకుపోయాయి. అయినా ఉద్యోగులను చిన్నచూపు చూడలేదని, అన్ని ప్రయత్నాలు చేస్తూ నెలకు రూ. 200 కోట్ల నుంచి రూ. 700 కోట్ల మేరకు బెనిఫిట్స్ కోసం చెల్లించామన్నారు. పీఆర్సీ విషయంలో కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. మీ సోదరుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు.

అందరం కలిసి రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా తీర్చిదిద్దుదాం. రోజులో ఒక గంట అదనంగా పనిచేద్దాం. పన్నులు కట్టకుండా ఎగ్గొడుతున్న వారిని పట్టుకునే బాధ్యత ఉద్యోగులదే. ఆదాయాన్ని పెంచాలి. ఆ ఆదాయాన్ని ఉద్యోగుల అవసరాలకే ఉపయోగిస్తాం. ప్రభుత్వం నిరుపేదలకు రేషన్ కార్డుల మంజూరు, సన్నబియ్యం పంపిణీ, 47 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 55 లక్షల కుటుంబాలకు రూ. 500 లకే సిలిండర్, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్య, బ్రేక్ ఫాస్ట్ స్కీమ్, మహిళా సంఘాల్లో ఆడబిడ్డలకు రూ. 60 వేల కోట్లు బ్యాంకు రుణాల లింకేజీ వంటి పథకాలను అందించడంలో ఉద్యోగుల శ్రమ ఉందని సీఎం అన్నారు. ప్రభుత్వ ఇమేజీని పెంచడంలో ఉద్యోగులే బ్రాండ్ అంబాసిడర్లు. ఉద్యోగులు ఆత్మగౌరవంతో నిలబడాలన్నది మా లక్ష్యం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. తద్వారా కూడా అదనపు ఆర్థిక భారం ప్రభుత్వంపై పడిందన్నారు మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు రాష్ట్రానికి ఎంతో అవసరం. గత పదేళ్లలో ఈ పనులు చేయాలని కొట్లాడినం. ఇప్పుడు మేం చేస్తామంటే కాళ్లల్లో కట్టెలు పెడుతూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సీఎం ఆరోపించారు.











Leave a Reply