NewsInn

News in a Click

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు-పాల్గొన్న సీఎం

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు-పాల్గొన్న సీఎం

(న్యూస్ఇన్‌,తిరుమ‌ల‌)

తిరుమ‌ల‌లో సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌హా కుటుంబ స‌భ్యులు ఉత్స‌వాల్లో పాల్గ‌న్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి ప్రభుత్వం తరఫున సీఎం పట్టువస్త్రాలు సమర్పించారు. మంగళవారం సంప్రదాయ వస్త్రధారణలో సతీ సమేతంగా తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో రవిచంద్రలు స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేద మంత్రాల నడుమ అర్చకులు సీఎంకు పరివట్టం కట్టి, పట్టువస్త్రాలను తలపై ఉంచారు. అనంతరం సీఎం దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ప్రభుత్వం తరఫున శ్రీవారికి లాంఛనంగా పట్టువస్త్రాలు సమర్పించడం తన అదృష్టమని స్వామివారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురవాలని, భారత్‌ అగ్రగామి దేశంగా తయారు కావాలని శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా మారాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంపదలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు అపారమైన నమ్మకం ఉందని సీఎం పేర్కొన్నారు. దేశ, విదేశాల్లోని భక్తులు ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని కోరుకుంటారని అన్నారు. స్వామివారి సన్నిధికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ పాలకమండలిని అధికారులకు సూచించారు.

శ్రీమలయప్ప స్వామి దర్శనం…..

సాలకట్ల బ్రహ్మోత్సవాల తొలిరోజు తిరుమాడ వీధుల్లో పెద్ద శేషవాహనంపై కొలువు దీరిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారిని సీఎం చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు వారికి ఆశీర్వచనం అందించారు. సీఎం సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్‌, ఆయన సతీమణి బ్రాహ్మణి శ్రీవారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీవారి ఆలయంలో టీటీడీ రూపొందించిన శ్రీవారి క్యాలెండర్‌, డైరీ సహా వివిధ ప్రచురణలను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *