(చెన్నై,న్యూస్ఇన్)
ఎన్నికలంటే నేతలు పోటీ చేయడం, ప్రజలు ఓట్లు వేయడం….. మెజార్టీ ఓట్లు సాధించిన వారు విజయం సాధించడం మాత్రమే…ఇలాంటి ఎన్నికలు రెండు దశాబ్దాల క్రితం ఉండేవి. పెరిగిన ఆధునికత, అందుబాటులోకి వచ్చిన సాంకేతికతో ఎన్నికల్లో విజయం కోసం ప్రజల నాడి పట్టుకోవడం ఒక వంతు…రాజకీయంగా అనుభవం ఉన్న నేతలు ప్రజల నాడిని సులువుగానే పసి గట్టగలరు. రాజకీయాల్లో సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న నేతలు ఈ విషయంలో ఎంతో పరిణితితో కూడా వ్యవహరిస్తుంటారు. ప్రజల నాడిని పసి గట్టి అందుకు అనుగుణంగా క్షేత్ర స్థాయిలో రాజకీయంగా పావులు కదపడం కూడా గతం నుంచి వస్తున్న ఆచారంగానే ఎన్నికల ప్రక్రియలో జరిగే తంతు. ఇప్పుడు ఇదంతా గతంగానే చెప్పుకునే పరిస్థితి….. సాంకేతికతను అందిపుచ్చుకుని నేతలను, పార్టీలను రాజకీయ కన్సెల్టెన్సీలు ముందుకు నడిపిస్తున్నాయి. 2014 లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ ప్రక్రియను తెర వెనుక అమలు చేసి విజయం దక్కించుకోవడంతో…. క్రమంగా ఈ విధానం రాజకీయ పార్టీలకు తమ మీద తమకున్న నమ్మకం కంటే పొలిటికల్ కన్సలెటెంట్లపైనే ఎక్కువగా నమ్మకం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ కన్సెల్టెన్సీలు కొంత వరకు సాంకేతికను, మ్యాన్ పవర్ ను వినియోగించుకుని రాజకీయ పార్టీలను నడిపిస్తుంటాయి. కొన్ని చోట్ల విజయం సాధిస్తుంటాయి. మరికొన్ని చోట్ల అపజయాన్ని తప్పించలేవు. ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలు, కీలక నేతలంతా ఈ పొలిటికల్ కన్సెల్టెన్సీలపైనే ఆధార పడుతున్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పుడు కార్పోరేట్ పొలిటికల్ కన్సెల్టెన్సీలు సేవలు అందించే పనిలో పడ్డాయి. ప్రజల మద్దతు ఆయా పార్టీలకు సంపూర్ణంగా ఉన్నా కన్సెల్టెన్సీ నివేదికల ఆధారంగానే క్షేత్ర స్థాయిలో నిర్ణయాలను రాజకీయ పార్టీలు అమలు చేయడం మొదలు పెట్టాయి. గెలిచిన పార్టీ తరపున పనిచేసిన పొలిటికల్ కన్సెల్టెన్సీలు ప్రచారం చేసుకుంటాయి. ఆ సంస్థలు ఎక్కడా ప్రత్యక్షంగా మీడియా ముందుకు రావు…తెరవెనుక చక్రం తిప్పినట్లు మాత్రం లీకులు ఇస్తుంటాయి. అసలు రాజకీయ నేతలు తమ ఆదేశాలు అమలు చేయడంతోనే విజయం దక్కించుకున్నారని సైలెంట్ గా పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఈ వ్యాపారం వందల కోట్ల నుంచి వేల కోట్ల రుపాయల వరకు వెళ్లిందనే టాక్ కూడా ఉంది. అంతా రహస్యంగా జరిగే వ్యవహారం కావడంతో పొలిటికల్ పార్టీలు దీని గురించి ఎక్కడా బయట పెట్టవు….. కన్సల్టెంట్లు మాత్రం ఆ పార్టీలకు విజయం వరిస్తే…తమ ఘనతే అని లీకులు ఇచ్చుకుంటూ రాజకీయ పార్టీలను నడిపించే కీలక శక్తులుగా గుర్తింపు పొందుతున్నాయి.

సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఎంజీ రాంచంద్రన్, ఎన్టీఆర్ ల హాయంలో ఇలాంటి సంస్థలు లేనే లేవు, వారి సినిమా గ్లామర్ వారిని పెద్ద నేతలుగా తయారు చేసింది. విజయ్ సినీ గ్లామర్ కంటే…. పొలిటికల్ కన్సల్టెన్సీ కదిపిన పావులు ఎంత వరకు తమిళ నాడు ఎన్నికల్లో కలిసి వచ్చాయన్నది ఆలోచించాల్సిన విషయమే. దీన్ని కొలిచేందుకు ఎలాంటి ప్రమాణాలు లేకపోవడంతో….. సేవలు అందించిన కన్సెల్టెన్సీలు ఇచ్చే లీకులు అంతా నమ్మాల్సిందే… తెలంగాణా ఎన్నికల్లో సునిల్ కనుగోలు ప్రణాళికలతో కాంగ్రెస్ గెలిచిందని ఆ పార్టీనేతలు చెబుతారు. ఏపీ ఎన్నికల కు ముందు నుంచి రెండో సారి కూడా వైఎస్ జగన్ సీఎం కావాలని ఐ ప్యాక్ జగన్ కు సలహాలు ఇచ్చింది. కానీ 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏపీలో కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది.అంతకు ముందు ఎన్నికల్లో జగన్ విజయం వెనుక ఐ ప్యాక్ సూచనలతోనే తమకు విజయం వరించిందని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఓటమికి మాత్రం ప్రభుత్వ తీరు కారణమని చేతులు దులుపుకున్నారు. ప్రజల నాడిని పసిగట్టి గెలిచే పార్టీలకు పనిచేసేందుకే పొలిటికల్ పార్టీలు పనిచేస్తాయన్నది మాత్రం అంతా అంగీకరించాల్సిన విషయమే. ఓటమి చెందిన పార్టీల కన్సల్టెన్సీలు మాత్రం తమ ప్రణాళికలు విఫలం అయ్యాయని చెప్పుకునే సందర్భాలు లేనే లేవు. ఇక పొలిటికల్ కన్సల్టెన్సీల నిర్ణయాల ప్రకారం రాజకీయ పార్టీలు నడుచుకుంటే…. పోటీ ఆ సంస్థల మధ్యే అన్నట్లు తయారుకావడం కూడా మనం రాబోయే రోజుల్లో చూడాల్సి వస్తుందేమో….ప్రముఖ పొలిటికల్ కన్సల్టెంట్ ప్రశాంత్ కిషోర్ దేశంలో అన్ని రాజకీయ పార్టీలను గెలిపించి బీహార్ లో తన పార్టీని ముందుకు ఎందుకు నడిపించలేకపోయారో ఆలోచించాల్సిన విషయమే.









Leave a Reply