NewsInn

News in a Click

అక్రిడేష‌న్ కార్డుల‌కు’రాహూల్ గాంధీ’ సిఫారసు..!

అక్రిడేష‌న్ కార్డుల‌కు’రాహూల్ గాంధీ’ సిఫారసు..!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణాలో రాష్ట్ర స్థాయి అక్రిడేష‌న్ కార్డుల డిమాండ్ ఢిల్లీకి చేరింది. స్టేట్ లెవెల్ అక్రిడేష‌న్ కార్డులు పొంందేందుకు లోక స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌ రాహూల్ గాంధీ కార్యాల‌యం వ‌ర‌కు కొంత మంది ఫిర్యాదులు చేశారు. రాహూల్ కార్యాల‌యంల కూడా ఆ ఫిర్యాదుల‌ను స్వీక‌రించి…..సిఫార‌సు లేఖ‌ల‌తో స్థానిక అధికారుల‌కు పంపించింది. రాహూల్ గాంధీ కార్యాల‌యం నుంచి సిఫార‌సు రావ‌డంతో స‌మాచార శాఖ అధికారులు ఆ ప‌త్రిక పై విచార‌ణ చేసేందుకు ఆ ప‌త్రిక పేర్కొన్న అడ్ర‌స్ కు వెళ్లి ప‌రిశీలించారు.ఒకే గ‌దిలో రెండు కంప్యూట‌ర్లు, రెండు దిన‌ప‌త్రిక‌లు అక్క‌డి నుంచి న‌డిపిస్తూ అక్రిడేష‌న్ కార్డుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు అధికారులు గుర్తించారు.

హైద‌రాబాద్ లో అక్రిడేష‌న్ కార్డును ద‌క్కించుకునేందుకు ఎంతో మంది ఏపీ జ‌ర్న‌లిస్టులు, జ‌ర్న‌లిస్టు సంఘాల నాయ‌కులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఏపీ మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ గా ఉన్న ఆల‌పాటి సురేష్ కూడా తెలంగాణా అక్రిడేష‌న్ కార్డుకు దర‌ఖాస్తు చేసుకోవ‌డంతో ఆ ద‌ర‌ఖాస్తును స్టేట్ మీడియా క‌మిటీ తిర‌స్క‌రించి సురేష్ కు స‌మాచారం ఇచ్చింది. రెండుమూడేళ్ల క్రితం వ‌ర‌కు మీడియా సంస్థ‌లో ప‌నిచేసే తెలంగాణా స‌మాచార హక్కు క‌మిష‌నర్లుగా అవ‌కాశం ద‌క్కించుకున్న ఓ వ్య‌క్తి కూడా అక్రిడేష‌న్ కార్డుకు ధ‌ర‌ఖాస్తు చేసుకోవ‌డంతో స‌మాచార హ‌క్కు క‌మిష‌న‌ర్ కు కార్డు జారీకి అక్రిడేష‌న్ క‌మిటీ బ్రేకులు వేసింది. ఇలా ఎంతో మంది తెలంగాణాలో అక్రిడేష‌న్ కార్డులు పొందేందుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నట్లు రాష్ట్ర స్థాయి అక్రిడేష‌న్ క‌మిటీ గుర్తించింది. ఇలాంటి ద‌ర‌ఖాస్తుల పై మ‌రింత ఫోక‌స్ పెట్టిన క‌మిటీ స్థానిక ప‌త్రిక‌లు, మీడియా సంస్థ‌లపై విచార‌ణ కూడా చేసింది. సీవీఆర్ టీవీ ఛానల్ లో త‌గినంత మంది అర్హులు అక్రిడేష‌న్ కార్డులు పొందేందుకు లేక‌పోవ‌డంతో… డ్రైవ‌ర్లు, ఆఫీస్ స‌బార్డినేట‌ర్ల పేర్ల‌తో జాబితా స‌మ‌ర్పించిన‌ట్లు క‌మిటీ గుర్తించింది. కొన్ని దిన‌ప‌త్రిక‌లు ఒకే గ‌ది ఒకటి లేదా రెండు కంప్యూట‌ర్లు ప‌ట్టే స్థ‌లమే ఉన్నా….రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున స‌ర్కులేష‌న్ తో త‌మ ప‌త్రిక‌లు న‌డుస్తున్నాయ‌ని స‌మ‌చారశాఖ‌కు ద‌ర‌ఖాస్తు చేసి రాష్ట్ర స్థాయిలో అక్రిడేష‌న్ కార్డులు ద‌క్కించుకునే ప్ర‌య‌త్నాలు చేశాయి. ఇలాంటి సంస్థ‌ల‌పై స‌మాచార శాఖ అధికారులు, క‌మిటీ ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టి కార్డుల జారీలో భారీగా కోత విధించింది. మీడియా సంస్థ‌లు పంపించే జాబితాకు అమోదం ఖ‌చ్చితంగా ద‌క్కుతుంద‌న్న అభిప్రాయంతో గ‌త అనుభ‌వం లేక‌పోయినా ఓ సంస్థ నుంచి గ‌తంలో అక్రిడేష‌న్ కార్డు పొందిన‌ట్లు న‌కిలీ కార్డు త‌యారు చేసి క‌మిటీకి దొరికి పోయారు. న‌కిలీ కార్డులో 2021 స్థానంలో 2031 అని ఉండ‌డంతో న‌కిలీ కార్డు అని అధికారులు గుర్తించారు. న‌కిలీ కార్డుతో ద‌ర‌ఖాస్తు చేసుకున్న వ్య‌క్తిపై పోలీసుల‌కు అధికారులు ఫిర్యాదు చేశారు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో ప‌నిచేసిన ప‌లువురు మీడియా ప్ర‌తినిధులు రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఏపీకి వెళ్లిపోయినా….తెలంగాణాలో స్వ‌తంత్ర జ‌ర్నిస్టులుగా కార్డులు పొందేందుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. సీనియ‌ర్ జ‌ర్నలిస్టులు వెట‌ర‌న్ కోటాలో అక్రిడేష‌న్ కార్డులు ద‌క్కించుకునేందుకు తెలంగాణా అక్రిడేష‌న్ కార్డుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ప్ర‌భుత్వం కేవ‌లం అర్హుల‌కే అక్రిడేష‌న్ కార్డులు ఇవ్వాలని నిర్ణ‌యం తీసుకున్నా….. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌తో ఎంతో అన‌ర్హులు ఇప్ప‌టికే కార్డులు త‌మ జేబుల్లో వేసుకున్నారు. కొన్ని చిన‌ప‌త్రిక‌ల యాజ‌మ‌న్యాలు త‌మ కుటుంబ స‌భ్యుల పేర్ల‌తో జాబితాలు స‌మ‌ర్పించి అక్రిడేషన్లు పొందింన‌ట్లు కూడా స‌మ‌చార శాఖ అధికారులు గుర్తించారు. కాని నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆ సంస్థ‌ల‌కు ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఉండ‌డంతో రాష్ట్ర క‌మిటీ, అధికారులు ఇవ్వ‌క త‌ప్ప‌లేదు.న‌కిలీ విలేక‌రుల‌కు అక్రిడేష‌న్లు అంద‌రాద‌న్న ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం ప‌క‌డ్భంధీగా క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఖ‌చ్చితంగా నిబంధ‌న‌లు అమ‌లు చేసి న‌కిలీ విలేక‌రుల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని జ‌న‌గాం క‌లెక్ట‌ర్ పోలీసు శాఖ‌తో విచార‌ణ చేయించారు. దీనిపై ఓ యూనియ‌న్ తీవ్ర అభ్యంతంరం వ్య‌క్తం చేస్తూ క‌లెక్ట‌ర్ తీరుపై మంత్రికి ఫిర్యాదు కూడా చేసింది. ప్ర‌భుత్వ నిబంద‌న‌ల అమ‌లు పేరుతో జిల్లాల్లో డీపీఆర్ఓ లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు తీవ్ర వివాదంగా మారుతోంది. కొన్ని జిల్లాల్లో ఉదాసీనంగా కార్డులు మంజూరు చేయ‌డం…మ‌రికొన్ని జిల్లాల్లో కార్డులు జారీకి నిబంధ‌న‌ల పేరుతో బ్రేకులు వేస్తున్న సంద‌ర్భాలు ఉన్నాయి. ప‌లు జిల్లాల్లో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యేలు అక్రిడేష‌న్ కార్డుల మంజూరీ విష‌యంలో జోక్యం చేసుకుంటున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త‌మ‌కు అనుకూలంగా ఉన్న వారికి అక్రిడేష‌న్ కార్డులు ఇవ్వాల‌ని సిఫార‌సు చేయ‌డం, గిట్ట‌ని వారుంటే వారికి కార్డు ఇవ్వ‌రాద‌ని డీపీఆర్ ఓ ల‌కు ఆదేశాలు ఇస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర స్థాయిలో అక్రిడేష‌న్ కార్డులు పారద‌ర్శ‌కంగా అర్హుల‌కు మాత్ర‌మే అందాల‌ని మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ కు రాష్ట్ర స్థాయి మీడియా క‌మిటీలో విశేష‌ అధికారాలు క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పించింది. ఇది కొంత వ‌ర‌కు ఫలితాన్ని సానుకూలంగా ఇచ్చినా…వివాదాల‌కు దారి తీసింది. మ‌రో వైపు అక్రిడేష‌న్ల జారీ పై ప‌లు సంఘాలు ఇప్ప‌టికే న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించాయి. న్యాయ స్థానం ఎలాంటి నిర్ణ‌యం వెల్ల‌డిస్తుందో అన్న చ‌ర్చ కూడా మీడియా వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *