NewsInn

News in a Click

భ్ర‌మ‌రాంబిక అమ్మ‌వారికి అరుదైన పట్టుచీర

భ్ర‌మ‌రాంబిక అమ్మ‌వారికి అరుదైన పట్టుచీర

(శ్రీశైలం, న్యూస్ఇన్‌)

తెలంగాణా రాష్ట్రం సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు కళారత్న నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను అమ్మవారికి సమర్పించారు. ఈ ప్రత్యేక వస్త్రాన్ని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడుకి అందజేశారు. ఈ సందర్భంగా చేనేత కళాకారుడు, విజయ్ కుమార్ మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులతో కలసి వారం రోజుల్లో ఈ పట్టుచీరను మగ్గంపై నేసినట్లుగా తెలియజేశారు. మొత్తం 5.5 మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు కలిగిన ఈ పట్టుచీర బరువు 200గ్రాముల దాకా వుంటుoదన్నారు. సంప్రదాయ “ఇక్కత్” నమూనాలో రూపొందించబడిన ఈ చీరను మడత పెట్టినప్పుడు చిన్న అగ్గిపెట్టెలో సులభంగా ఇమిడిపోతుందన్నారు. అమ్మవారి కృపతోనే ఈ అరుదైన వస్త్రాన్ని రూపొందించడం జరిగిందన్నారు.

దేవస్థానం తరపున ఈ ప్రత్యేక పట్టుచీరను స్వీకరించిన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు విజయ్ కుమార్ ప్రతిభను అభినoధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంప్రదాయమైన పట్టుచీర మన చేనేత కళాకారుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. మనదేశ సాంస్కృతిక వ్యవస్థలో చేనేత రంగానికి ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు. మనదేశంలో చేనేత కేవలం వృత్తిమాత్రమే కాదని అది తరతరాలుగా వస్తున్న ఒక గొప్ప కళ అని అన్నారు. కళాకారుల సృజనాత్మక , నైపుణ్యం మరియు అంకిత భావాలకు చేనేత వస్త్రాలు ప్రతిరూపంగా నిలుస్తాయన్నారు. అందరుకూడా చేనేత వస్త్రాలను ఆదరించాలన్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *