NewsInn

News in a Click

కాంగ్రెస్ ‘స‌ర్కార్’ పై సీనియ‌ర్ల అటాక్

కాంగ్రెస్ ‘స‌ర్కార్’ పై సీనియ‌ర్ల అటాక్

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్)

రాష్ట్రంలో రాజ‌కీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. వేస‌వి తీవ్ర‌త‌తోపోటీ ప‌డే విధంగా కాంగ్రెస్ రాజ‌కీయాలుహాట్ హాట్ గా మారుతున్నాయి. సీనియ‌ర్ నేత‌లు త‌మ వైఖరిని బ‌హిరంగంగానే ప్ర‌క‌టిస్తున్నారు. అధికార పార్టీలో ఉన్న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కుతున్నారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న సీనియ‌ర్ నేత ఆ పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌తో పార్టీకే గుడ్ బై చెప్పాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. త్వ‌రలో ఆ నేత కారెక్క‌నున్నారు. మాజీ సీఎం కేసిఆర్ తో సుదీర్ఘ బేటీ కూడా పూర్త‌యింది. ఈ నెల 20వ తేదీన గులాబీ పార్టీ ఏర్పాటు చేసే భారీ బ‌హిరంగ స‌భ‌లో ఆ నేత కారెక్క‌నున్నారు. కేసీఆర్ తో భేటీ అనంత‌రం జీవ‌న్ రెడ్డి కాంగ్రెస్ వైఫ‌ల్యాల‌పై విమ‌ర్శ‌లు మొద‌లు పెట్టారు. ప్ర‌జల ప‌క్షాన పోరాడుతా అని ప్ర‌క‌టించిన ఆయ‌న‌….కాంగ్రెస్ ప్ర‌భుత్వ విధానాల‌ను ఎండ‌గ‌ట్ట‌డం మొద‌లు పెట్టారు. కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో పార్టీ మారుతున్న ఈ నేత కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు చేస్తుండ‌డం కూడా కాంగ్రెస్ లో చ‌ర్చ‌కు దారి తీస్తోంది. జీవ‌న్ రెడ్డికి కౌంట‌ర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు ఎవ‌రు ముందుకు రాక‌పోవ‌డంతో….జూనియ‌ర్ నేత‌ల‌ను కాంగ్రెస్ హై క‌మాండ్ రంగంలోకి దించి జీవ‌న్ రెడ్డిపై విమ‌ర్శ‌లు చేయించ‌డం మొద‌లు పెట్టింది. తాజాగా ఈ సీనియ‌ర్ నేత కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంలో అనుస‌రిస్తున్న విధానాన్ని టార్గెట్ గా చేసుకున్నారు. రాష్ట్రంలో క‌రువు ప‌రిస్థితులు వ‌స్తే….అందుకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బాధ్య‌త వ‌హించాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు పూర్తి చేయ‌డంలో ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

మ‌రో వైపు దాదాపు అదే స్థాయిలో రాజ‌కీయ అనుభ‌వం ఉన్న సీనియ‌ర్ నేత మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల‌న‌లో చోటు చేసుకుంటున్న ప‌రిస్థితుల‌పై సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి తాను ఎవ‌రితో మాట్లాడాలో అర్ధం కావ‌డం లేద‌న్నారు. నీటి పారుద‌ల శాఖ మంత్రికి 20 సార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేద‌న్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ప‌లు మార్లు సాగునీటి ప్రాజెక్టు విష‌యంలో చేప‌ట్టాల్సిన ప‌నుల‌పై ప‌లు మార్లు చెప్పినా ఫ‌లితం ద‌క్క‌లేద‌ని పోచారం వ్యాఖ్యానించారు. బీఆర్ ఎస్ పార్టీ నుంచి విజ‌యం సాధించి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయ‌న త‌న సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వాన్ని ప్ర‌స్తావిస్తూ…గ‌తంలో ఇలాంటి ప్ర‌భుత్వాన్ని ఎప్పుడూ చూడ‌లేద‌న్నారు.పోచారం ఫోన్ లో మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు తెలంగాణా రాజ‌కీయాల్లో హాట్ హాట్ గా చ‌ర్చ‌కు దారి తీస్తోంది. బాన్స్ వాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హించే పోచారం శ్రీనివాస్ రెడ్డి త‌న నియోజ‌కర్గంలో సాగునీటి ప్రాజెక్టు గురించి ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ అంశంపై స్పందించిన అదే జిల్లాకు చెందిన పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ స‌మ‌స్య‌లు ఉన్న మాట వాస్త‌వేమ‌న‌ని అంగీక‌రిస్తూ….. పోచారం లాంటి సీనియ‌ర్ నేత ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను అర్ధం చేసుకుంటాన‌ని వ్యాఖ్య‌లు చేశారు.

రాష్టంలో పాల‌న వ్య‌వ‌హారాల‌పై సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌లు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం హ‌స్తం పార్టీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు చేసే వ్యాఖ్య‌ల గురించి పెద్ద‌గా ప‌ట్టిచంకోక‌పోయినా….అధికార పార్టీకి అనుబంధంగా మారిన నేత వ్యాఖ్య‌లు దూమారం రేపుతున్నాయి.మ‌రో వైపు మంత్రి వ‌ర్గంలో చోటు ఆశిస్తున్న రాజ‌గోపాల్ రెడ్డి లాంటి నేత‌లు అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా త‌మ అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కుతున్నారు. సీనియ‌ర్ నేత‌లు చేస్తున్న ఇలాంటి వ్యాఖ్య‌లు రాబోయే రోజుల్లో అధికార పార్టీకి మ‌రిన్ని చిక్కులు సృష్టించే అవ‌కాశం క‌నిపిస్తోంది. సీనియ‌ర్ నేత‌లే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తుండ‌డంతో పార్టీ క్యాడ‌ర్లో కూడా అసంతృప్తి రాజుకునే చాన్స్ ఉంటుంది. అధికార పార్టీలో చోటు చేసుకుంటున్న ఈ ప‌రిణామాలు రాజ‌కీయంగా ప్ర‌తిప‌క్ష పార్టీల్లో జోష్ నింప‌నుంది.

జ‌గిత్యాల‌లో బీఆర్ఎస్ స‌భ‌…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *