NewsInn

News in a Click

ఆకలి తీరితేనే నిజమైన అభివృద్ధి-చంద్ర‌బాబు

ఆకలి తీరితేనే నిజమైన అభివృద్ధి-చంద్ర‌బాబు

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌)

పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంత అభివృద్ధి సాధించినా పేదలకు పట్టెడన్నం లేకపోతే అది వృధా అని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా అన్నార్తుల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. పలనాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం, ధరణికోటలో కార్మికులతో కలిసి సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ధరణికోటలో ఏర్పాటు చేసిన రూరల్ అన్న క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం రూ.5 వెచ్చించి టోకెన్ కొనుగోలు చేసిన ముఖ్యమంత్రి కార్మికులతో కలిసి భోజనం చేశారు. అంతకముందు క్యాంటీన్‌కు వచ్చిన పేదలు, కార్మికులకు ఆయన స్వయంగా భోజనం వడ్డించారు. లబ్దిదారులతో ముచ్చటిస్తూ అన్న క్యాంటీన్‌లోనే సీఎం ఆహారాన్ని తీసుకున్నారు. అన్న క్యాంటీన్లలో అందిస్తున్న భోజనం రుచి, శుభ్రత, నాణ్యతల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “కడుపు నిండితేనే నిజమైన అభివృద్ధి నేను నమ్ముతాను. అందుకే పేదవాడి ఆకలికి తీర్చడానికి ప్రజాప్రభుత్వం అన్న క్యాంటీన్లు తెచ్చింది. పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే నా రాజకీయం అని ఎన్టీఆర్ రూ.2 లకే కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రత పథకానికి నాంది పలికారు.

నిత్యాన్నదాతగా డొక్కా సీతమ్మ పేరు అజరామరం. ఆకలి అన్న వాళ్ల కాదనకుండా అన్నం పెట్టడం మన సంస్కృతిలోనే ఉంది. సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీ సిద్దాంతంలోనే ఉంది. నాటి రెండు రూపాయల కిలో బియ్యం నుంచి నేటి అన్నా క్యాంటీన్ల వరకు ఆహార భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. 2024లో అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేశాం. ముందుగా పట్టణ ప్రాంతాల్లో అన్నక్యాంటీన్లు ప్రారంభించాం. ఇవాల్టి నుంచే గ్రామీణ ప్రాంతాల్లో 62 అన్నక్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే పట్టణాల్లో 204, గ్రామాల్లో 65 కలిపి ఈ సంఖ్య 269కి పెరిగింది. త్వరలో మరో 5 క్యాంటీన్లు సిద్ధం అవుతున్నాయని” సీఎం తెలిపారు.

అక్షయ పాత్రకు అభినందనలు……

అన్న క్యాంటీన్లకు నిరంతరం ఆహార సరఫరా చేస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్‌ను అభినందిస్తున్నాను. 25 ఏళ్లుగా ఈ ఫౌండేషన్ 500 కోట్ల భోజనాలను సరఫరా చేసింది. అన్న క్యాంటీన్లలో రూ.5కే అందిస్తున్న భోజనం పేద వాళ్లు, ఆటోడ్రైవర్లు, ముఠా కార్మికులు, కూలీలకు ఆసరాగా నిలుస్తోంది. పేదవాళ్లకు వచ్చే కొద్దిపాటి డబ్బులతో బయట హోటల్‌లో తినడం ఆర్ధికంగా ఎంత భారమో నాకు తెలుసు. అన్న క్యాంటీన్ల ఏర్పాటుతో వారి డబ్బు ఆదా అయ్యి ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *