(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఈ నెల 25 వ తేదీన తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు రాష్ట్రంలో కొత్త పార్టీని ప్రకటించనున్నారు. నగర శివారుల్లోని భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ పార్టీ ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నారు. ఆ లోపే జాగృతిలోకి పెద్ద ఎత్తున చేరికలు మొదలు పెట్టేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. కవిత పార్టీ విధి, విధానాలు ప్రకటించక ముందే కొంత మంది నేతలు కవిత పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు.
కొత్త రాజకీయ శక్తిగా రాబోతున్న జాగృతిలో చేరాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బోథ్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు రాథోడ్ బాపూరావు ఆదివారం తన అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో చేరారు. కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పని చేసిన నాయకులంతా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. 2007లో కుటుంబంతో సహా తాను బోథ్ కు వెళ్లి అక్కడి ఆదివాసీలు, గిరిజనుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అదే స్ఫూర్తితో పని చేయాల్సి ఉందన్నారు.

బాపూరావు తెలంగాణ జాగృతి నుంచే బీఆర్ఎస్ లో చేరి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారని.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీలో చేరుతున్నారని అన్నారు. కొత్త పార్టీలో చేరడానికి అన్ని జిల్లాల నుంచి నాయకులు ముందుకు వస్తున్నారని కవిత వెల్లడించారు.సిరిసిల్ల జిల్లా నుంచి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సహా పలువురు నాయకులు ఈరోజు జాగృతిలో చేరారన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి కవిత ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అన్నారు. కవిత ఇచ్చిన ధైర్యంతోనే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. పార్టీలోకి మధ్యలో వచ్చిన వాళ్లు మంత్రులు అయ్యారని, తనకు మూడోసారి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదన్నారు.












Leave a Reply