
(కరీంనగర్, న్యూస్ఇన్)
కరీంనగర్ లో జువెలరీ దుకాణంలో కాల్పులు కలకలం రేపాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన జరుగడం ఒక్క సారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. పట్టణంలోని ఓ జువెలరీ దుకాణంలో బంగారం కొంటామని దుండగులు ముందుగా ఇద్దరు వచ్చి గోల్డ్ చైన్లను పరిశీలిస్తున్నట్లు నటించారు. ఆ తరువాత మరో ఇద్దరు, మరి కొద్ది సేపట్లోనే ఇంకా ఇద్దరు ఆ దుకాణానికి చేరుకున్నారు. ఆ తరువాత దుకాణంలో ఉన్న బంగారాన్ని దోచుకునే యత్నం చేశారు. దోపిడీ దొంగలని గుర్తించిన జువెలరీ దుకాణంలో పనిచేసే కార్మికులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో దుండుగులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. అదే ప్రాంతంలో పర్యటిస్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వెంటనే ఈ ఘటనకు కేంద్రమైన దుకణాన్ని సందర్శించారు. స్థానికులతో అడిగి ఘటనపై ఆరా తీశారు. జ్యువెలరీ షాపులోని సీసీ పుటేజీని బండి సంజయ్ పరిశీలించారు. కాల్పుల ఘటనపై షాపు సిబ్బంది వద్ద ఆరా తీశారు. ఆ తరువాత పోలీస్ కమిషనర్ తోపాటు స్థానిక పోలీసులతో మాట్లాడారు. కాల్పుల్లో గాయపడ్డ వారికి ప్రాణాపాయం లేదని, అయితే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తున్నామన్నారు. దోపిడి కోసం వచ్చిన దుండగలు జువెలరీ షాపు నుంచి ఎంత విలువ చేసే ఆభరణాలు దోపిడీకి పాల్పడ్డరన్నదానిపై పోలీసులు దృష్టి సారించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు నగరంలోని అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టి దొంగలను అదుపులోకి తీసుకునే చర్యలు మొదలు పెట్టారు.








Leave a Reply