NewsInn

News in a Click

సరస్వతీ అంత్య పుష్కరాలు

సరస్వతీ అంత్య పుష్కరాలు

(హైదరాబాద్, న్యూస్ఇన్)

కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతీ అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేసింది. పుష్కర స్నానాలు మే 21 వ తేదీ నుండి 12 రోజుల పాటు (జూన్ 1 వరకు) జరగనున్నాయి. ఈ పుష్కరాలకు 30 నుండి 40 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసి ఏర్పాట్లు చేసింది. పుష్కరాలకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఎత్తున ఏర్పాట్లు చేసింది.

     గత సంవత్సరం జరిగిన సరస్వతీ ఆది పుష్కరాల సందర్భంగా జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ అంత్య పుష్కరాలకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలను చేపట్టింది. ప్రస్తుత వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పుష్కర ఘాట్ వద్ద కాయర్ మ్యాట్లు, చలువ పందిళ్లు,ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు.అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పుష్కర ఘాట్ పరిసరాల్లోని 23 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్, బీ.టి రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పుష్కరాల పనుల కోసం ప్రభుత్వం రూ. 30.63 కోట్ల నిధులను కేటాయించింది. 

గవర్నర్ శుక్లా తొలి పుష్కర స్నానం

Kaleshwaram Temple Saraswati pushkaralu
  పుష్కరాల తొలిరోజైన 21 వ తేదీ తెల్లవారు జామున 5.43  గంటలకు  కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా  లు పుష్కర స్నానం చేసి అంత్య పుష్కరాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. 21 వ తేదీ నుండి జూన్ 1 వతేదీ వరకు ప్రతీ రోజూ ఒక ప్రముఖ పీఠం స్వామిజీ ఈ పుష్కారాల్లో పాల్గొని పుణ్య స్నానం చేస్తారు. ప్రతీరోజూ ఉదయం హోమాల నిర్వహణ,  సాయంత్రం పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు  చేశారు.  పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 90 షటిల్ బస్సులను ఏర్పాటు చేశారు. రెస్క్యూ బృందాలతోపాటు ప్రత్యేక శిక్షణ పొందిన 100 మంది గజ ఈతగాళ్లను సరస్వతీ ఘాట్, నదీ ప్రాంతంలో నియమించారు.  

మ్యూజియం ఏర్పాటు…

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.1.20కోట్లలతో ప్రత్యేకంగా మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నాగేంద్ర స్వామి ఆలయాన్ని 30 లక్షలతో పునర్నిర్మాణం చేశారు. పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ నిర్వహించే హారతి, హోమాలు, తెప్పోత్సవం లకు పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేపట్టారు.

పుష్కరాలకు హాజరయ్యే వారి సౌకర్యార్థం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పించారు. దాదాపు 500 టాయిలెట్లు ప్రత్యేకగా ఏర్పాటు చేయడంతోపాటు తాగునీటి కోసం రెండు ఓ.హెచ్.ఆర్.సి లను నిర్మించారు. వాహనాల కోసం ఏర్పాటు చేసిన 23 పార్కింగ్ కేంద్రాలలోనూ తాగునీటి సౌకర్యంతో పాటు టాయిలెట్లను కూడా ఏర్పాటు చేశారు.

Kaleshwaram beautification

౩౦౦ మంది వైద్యులతో మెడికల్ క్యాంపులు

కాళేశ్వరం పుష్కర ఘాట్ లోని 23 జోన్లలో ప్రత్యేక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఇందుకుగాను 300 మంది వైద్యాధికారులు, పారా మెడికల సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. అన్ని ప్రధాన ప్రాంతాల్లో అంబులెన్సులు నియమించారు. మహాదేవ పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రెఫరల్ ఆసుపత్రిగా ఏర్పాటు చేశారు. 

245 ఎకరాల్లో పార్కింగ్…

Kaleshwaeam arrangements
 ఈసారి సరస్వతీ అంత్య  పుష్కారాలకు లక్షా 70 వేల వాహనాలు వస్తాయని అంచనా వేసి వీటికి గాను 245 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ ఏరియాలతో పాటు ఘాట్స్, టెంపుల్ తదితర ప్రాంతాలలో 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.  పుష్కర స్నానాలకు వెళ్లే మార్గంలో ప్రత్యేకంగా ఎల్.ఈ.డీ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ 12 రోజులపాటు పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకుగాను 300 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు. పుష్కార ఘాట్లలో నిరంతరం  విద్యుత్ సరఫరా  జరిగే విధంగా చర్యలు చేపట్టారు.  

100 మంది గజ ఈతగాళ్ళు…

 పుష్కర  స్నానాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సుమారు 100 మంది గజ ఈతగాళ్లను నియమించారు. వీటితోపాటు సెఫ్టీ బోట్స్, లైఫ్ రింగ్స్, ఎస్.డి.ఆర్.ఎఫ్ టీంలను నియమించారు. పుష్కర కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు మీడియా సెంటర్ ను కూడా ఏర్పాటు చేశారు.       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *