(హైదరాబాద్,న్యూస్ఇన్)
మంత్రి జూపల్లి కృష్ణారావ్ కు ఈ విడత మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో స్థానం ఉంటుందా….ఊడుతుందా అన్నది ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూపల్లి వ్యవహారంపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి జూపల్లి కృష్ణరావ్ కూడా మంత్రి పదవిని కాపాడుకునేందుకు రాజకీయంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ తో కయ్యానికి కాలుదువ్వినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై తెలంగాణా లో భవన్ లో చర్చకు సిద్దమని ప్రకటించి సమయానాకి ట్విస్ట్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఆత్మరక్షణలో వేసింది. ఆ మరుసటి రోజు మరోసారి జూపల్లి రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలను మొదలు పెట్టినా….పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సవాల్ విసిరితే….. అందుకు అనుగుణంగా నడుచుకోవాల్సిన సీనియర్ నేత వైఖరిని తప్పుబట్టినట్లు ప్రచారం జరుగుతోంది. రాబోయే రోజుల్లో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకుని జూపల్లి వేసిన అడుగులు అంటూ ప్రచారం జరుగుతోంది. పార్టీ కంటే తన పదవిని కాపాడుకునే చర్యల్లో భాగంగానే బీఆర్ఎస్ తో చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మంత్రిగా దాదాపు మూడేళ్లు అవుతున్నా… పర్యాటకశాఖ పై పెద్దగా పట్టు సాధించలేదన్న వాదన కూడా ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. జూపల్లి ఆరోగ్య పరిస్థితిపై భిన్న ప్రచారాలు జరుగుతున్నాయి. ఆరోగ్యంగా కనిపిస్తున్నా…. వయోభారంతో వచ్చే సమస్యలు వెంటాడుతున్నాయన్న చర్చ కూడా ఉంది. వ్యక్తులను గుర్తించకపోవడం, సరిగ్గా స్పందించకపోవడం వంటి సమస్యలు దాదాపు ఆయనను కలిసిన ప్రతి ఒక్కరికి అనుభవం అయి ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఈ పరిస్తితిని అంచనా వేసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి లేకుండానే పర్యటక శాఖ పై స్వయంగా సమీక్ష నిర్వహించారు. సీఎం సమీక్ష మరుసటి రోజే మంత్రి జూపల్లి మరోసారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజకీయంగా తన ప్రాధాన్యత తగ్గుతుందన్న అనుమానాలతో మంత్రి రాజకీయంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోపు మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ జరిగితే ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులతో పాటు…మరో రెండు స్థానాలను కూడా భర్తీ చేయాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల టీం ను సిద్ధం చేసుకునేందుకు ఇదే సరైన సమయంమని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో జూపల్లితో పాటు మరో ఇద్దరికీ పదవీ గండం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

పాలమూరు జిల్లాలో సీనియర్ నేత కావడంతోనే మంత్రివర్గంలో సీఎం రేవంత్ రెడ్డి జూపల్లికి తొలి విడతలోనే స్థానం కల్పించారు. రెండో విడతలో ఆ జిల్లాకు చెందిన నేత వాకిటి శ్రీహరికి అవకాశం కల్పించారు. ఈ నెలాఖరులోపు పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. జూపల్లి కృష్ణరావ్ ను క్యాబినెట్ నుంచి తప్పిస్తే అదే సామాజిక వర్గానికి చెందిన మరో నేతకు అవకాశం దక్కే చాన్స్ ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.












Leave a Reply