(హైదరాబాద్, న్యూస్ఇన్)
బంజారాహిల్స్లోని రోడ్డు నంబరు 13లో బంజారా లేక్ను ఆనుకుని ఉన్న 3.63 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 600ల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. నిజాం కాలంలో జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ లే ఔట్లో అన్ రికగ్నైజ్డ్ ప్లాట్గా మిగిలిన ఈ భూమి కోర్టు వివాదంలో ఉంది. ఈ భూమిని ఆక్రమించుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారని.. దీనిని కాపాడి పార్కుగా అభివృద్ధి చేయాలని బంజారాహిల్స్ లేక్ పరిరక్షణ సమితితో పాటు.. స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నిజాంల కాలంలో వేసిన లే ఔట్లో ఈ ప్లాట్ను ఎవరూ కొనలేదని.. కాని పక్కన ఉన్న వారు తమదిగా చెబుతూ ఆక్రమించారని.. ఇప్పుడు వారసులు దీనిపై కోర్టులో పోరాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చెరువును ఆనుకుని ఉన్న ఈ భూమి వల్ల పరిసరాలన్నీ చెత్తగా మారి.. చెరువు డంపింగ్ యార్డుగా తయారయ్యిందని స్థానికులు వాపోయారు. ఈ భూమిని కాపాడడంతో పాటు.. చెరువును అభివృద్ధి చేయాలని కోరారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో హైడ్రా పరిశీలించింది. కోర్టు వివాదం తేలే లోపు ఎవరూ కబ్జా చేయకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసింది. కేసు వివరాలను పొందుపరుస్తూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.
800ల గజాల పార్కు…..
రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం మామిళ్ల గ్రామ పరిధిలోని వెంకటాద్రి నగర్లో 800 గజాల పార్కును హైడ్రా గురువారం కాపాడింది. 1975లో 7.20 ఎకరాల పరిధిలో 118 ప్లాట్లతో లే ఔట్ వేయగా.. అందులో 800 గజాలను పార్కు కోసం కేటాయించారు. ఇలా కేటాయించిన పార్కు స్థలాన్ని ప్లాట్లుగా చేసి లే ఔట్ వేసిన వాళ్లు అమ్మేశారు. పార్కు స్థలాన్ని ఎలా అమ్ముతారని స్థానికంగా ఉన్న వారు అప్పట్లోనే అడ్డుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేసేయడం.. దానిమీద బ్యాంకు రుణాన్ని పొందడం జరిగింది. బ్యాంకు రుణం తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకర్లకు అనుమానం వచ్చి విచారించగా పార్కు స్థలంగా తేలింది.
మరో వెయ్యి గజాల పార్కు …….
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ మండలం అనఘాపురి కాలనీలో 500ల గజాల చొప్పున ఉన్న రెండు పార్కులను హైడ్రా గురువారం కాపాడింది. 1980 దశకంలో 16 ఎకరాల మేర 240 ప్లాట్లతో లే ఔట్ వేశారు. ఇందులో 500ల గజాల చొప్పున రెండు ప్లాట్లను పార్కులుగా కేటాయించారు. తర్వాత వీటిని ప్లాట్లుగా మార్చేసి కబ్జా చేశారు.
పార్కుల కోసం కేటాయించిన స్థలాలుగా హైడ్రా నిర్ధారించింది. అందులో ప్రీకాస్ట్ ఇటుకలతో నిర్మించిన ప్రహరీలను తొలగించింది. పార్కు స్థలంగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేయడమే కాకుండా చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసింది.












Leave a Reply