(హైదరాబాద్, న్యూస్ఇన్)
సేఫ్ సిటీ ప్రాజెక్టుతో నగరంలో భద్రత మరింత కట్టుదిట్టంగా మారుతుందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పెరుగుతున్న జనాభా, సాంకేతిక పరిజ్ఞాన విస్తరణతో పాటు ప్రజల భద్రతకు కొత్త సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ అత్యాధునిక సాంకేతికతతో “సేఫ్ సిటీ ప్రాజెక్ట్” ను అమలు చేస్తోంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు, పాదచారులు మరియు ప్రజలందరికీ సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.ఈ ప్రాజెక్టు అమలును మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు డీజీపీ సి.వి. ఆనంద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సేఫ్ సిటీ ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులకు మరింత సురక్షిత వాతావరణాన్ని కల్పించడంతో పాటు, నేరాలపై సత్వరమే చర్యలు తీసుకునేందుకు తెలంగాణ పోలీసులు సాంకేతిక ఆధారిత పోలీసింగ్ను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు
సురక్షిత నగరం దిశగా చర్యలు….
సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక సీసీటీవీ కెమెరాలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వ్యవస్థలు వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగిస్తూ నేరాల నివారణ, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందనకు చర్యలు చేపట్టాలని డీజీపీ సూచించారు.
మహిళల కోసంషీ టాయిలెట్లు……
మహిళల భద్రత, సౌకర్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తు ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 12 మొబైల్ షీ టాయిలెట్లను ఏర్పాటు చేసింది. వీటికి అదనంగా మరో 12 షీ టాయిలెట్లను ఏర్పాటు చేసి మహిళలకు పరిశుభ్రమైన, సురక్షితమైన మరుగుదొడ్ల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులకు సూచించారు.

భరోసా సెంటర్లు పని తీరు భేష్…
మహిళల భద్రత కోసం షీ టీమ్స్, భరోసా సెంటర్లు, హాక్ఐ యాప్, సేఫ్ ట్రావెల్ కార్యక్రమాలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని డీజీపీ తెలిపారు. మహిళలు భయాందోళనలు లేకుండా నగరంలో పని చేసుకునేలా పరిస్థితిలు కల్పించాలని ఇందుకోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
నిఘా వ్యవస్థ బలోపేతం….
తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ సంయుక్తంగా అమలు చేస్తున్న సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నగర భద్రతను మరింత పటిష్టం చేసేందుకు అత్యాధునిక సీసీటీవీ నిఘా వ్యవస్థను విస్తరిస్తున్నారు. ప్రాజెక్టు మొదటి దశలో మొత్తం 2,306 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 974, సైబరాబాద్లో 574, మల్కాజి గిరి కమిషనరేట్లో 758 కెమెరాలు ఏర్పాటు చేసి సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. రెండో దశలో మొత్తం 862 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో హైదరాబాద్లో 452, సైబరాబాద్లో 297, మల్కాజి గిరి 113 కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
సీసీటీవీలు, ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ పనిచేయాలి….
నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు ఎల్లప్పుడూ పనిచేసేలా పర్యవేక్షణను బలోపేతం చేయాలని డీజీపీ ఆదేశించారు. అదే విధంగా పాదచారుల భద్రత కోసం 77 ప్రాంతాల్లో పాదచారుల సిగ్నల్స్ ఉన్నట్లు అధికారులు వివరించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన 404 ట్రాఫిక్ సిగ్నల్స్ను మరమ్మతులు చేసి పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని డిజిపి జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు.
ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక చర్యలు…..
ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే క్యూర్ ప్రాంతంలో ప్రత్యేక ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టాలని, పాదచారులకు సురక్షితంగా రోడ్లు దాటే అవకాశాలు కల్పించాలని డీజీపీ సూచించారు. సేఫ్ సిటీ, మహిళల భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాల నివారణ, డ్రగ్స్ నిర్మూలన వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నగరంలో అందుబాటులో ఉన్న ఆడియో ప్రచార వాహనాలను మరింత సమర్థవంతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు.













Leave a Reply