NewsInn

News in a Click

సైబర్ నేరాలే అతి పెద్ద స‌వాల్-డీజీపీ సీవి ఆనంద్

సైబర్ నేరాలే అతి పెద్ద స‌వాల్-డీజీపీ సీవి ఆనంద్

(హైదరాబాద్,న్యూస్ఇన్‌)

నేడు స‌మాజంలో జ‌రుగుతున్న సైబ‌ర్ నేరాలే పోలీసు శాఖ‌కు అతి పెద్ద స‌వాల్ విసురుతున్నాయ‌ని డీజీపీ సీవి ఆనంద్ అభిప్రాయ ప‌డ్డారు. రాష్ట్రంలో సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు వేగవంతమైన సేవలు, సాంకేతిక సామర్థ్యాల పెంపు లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపడుతున్న కార్యక్రమాలపై డీజీపీ సి.వి. ఆనంద్స స‌మీక్ష నిర్వహించారు.ప్రస్తుతం గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వంటి ప్రత్యేక బలగాల పునర్వ్యవస్థీకరణతో పాటు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించిన ప్రత్యేక విభాగాల ఏర్పాటు జరుగుతోందని తెలిపారు. అవసరమైతే మానవ వనరులను సమర్థంగా వినియోగించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు.ప్రతి పోలీసు అధికారి సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి పట్టు సాధించి, సైబర్ నేరాలను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి” అని డీజీపీ సి.వి. ఆనంద్ సూచించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరోలోని సైబర్ ల్యాబ్, సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (SOC), సెంట్రల్ మానిటరింగ్ యూనిట్, సోషల్ మీడియా యూనిట్, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, డిజిటల్ ఫోరెన్సిక్ యూనిట్ తదితర విభాగాలను సందర్శించి సమీక్షించారు.సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సైబర్ నేరాల తాజా ధోరణులు, దర్యాప్తు విధానాలు, కృత్రిమ మేధస్సు (AI) వినియోగం, బాధితులకు అందిస్తున్న సేవలు, భవిష్యత్ కార్యాచరణపై డీజీపీకి వివరించారు.

AI కాల్ సెంటర్ పై డీజీపీ ప్రశంసలు….

సమీక్షలో భాగంగా డీజీపీ స్వయంగా AI ఆధారిత సైబర్ కాల్ సెంటర్ పనితీరును పరిశీలించారు. “నేను సైబర్ మోసంలో డబ్బులు కోల్పోయాను” అని బాధితురాలు చెప్పగానే AI వ్యవస్థ వెంటనే స్పందించి, ఆమెకు ధైర్యం చెబుతూ పేరు, ప్రాంతం, సమీప పోలీస్ స్టేషన్, సంఘటన వివరాలను సేకరించింది. అదే సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్‌కు ఆటోమేటిక్‌గా సమాచారం చేరే విధానాన్ని డీజీపీ పరిశీలించి అభినందించారు. ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు AI ఆధారిత సేవలను విస్తరించాలని అధికారులకు సూచించారు.

నేరాల నియంత్రణలో ఫలితాలు….

సమీక్ష సందర్భంగా అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం, 2025లో తెలంగాణలో సైబర్ నేరాల వల్ల రూ.1,524 కోట్ల ఆర్థిక నష్టం నమోదైనప్పటికీ, 2024తో పోలిస్తే ఆర్థిక నష్టాల్లో 20 శాతం తగ్గుదల నమోదైంది. అదే విధంగా సైబర్ ఫిర్యాదులు 91,369కు పరిమితమవడంతో ఫిర్యాదుల్లో కూడా 3 శాతం తగ్గుదల నమోదైంది.
నేరస్తుల ఖాతాల్లోని నిధులను నిలిపివేసే POH మొత్తం రూ.255 కోట్ల నుంచి రూ.279 కోట్లకు పెరగగా, POH శాతం 9 శాతం నుంచి 12 శాతానికి పెరగడం బాధితుల సొమ్ము రక్షణలో తెలంగాణ సాధించిన పురోగతికి నిదర్శనమని అధికారులు వివరించారు.

సైబర్ నేరాల్లో రికవరీ……

2025లో దేశవ్యాప్తంగా నమోదైన 49,620 సైబర్ FIRలలో తెలంగాణలోనే 21,639 FIRలు నమోదయ్యాయి. అంటే దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం సైబర్ FIRలలో 44 శాతం తెలంగాణ నుంచే నమోదయ్యాయి. దీంతో సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
అలాగే రూ.75 లక్షలకు పైగా నష్టం కలిగిన కేసుల్లో 78 శాతం, రూ.1 లక్షకు పైగా నష్టం ఉన్న కేసుల్లో 56 శాతం FIR కన్వర్షన్ రేటు నమోదు కావడం రాష్ట్ర పోలీసుల సమర్థవంతమైన చర్యలకు నిదర్శనమని అధికారులు వివరించారు.

సైబర్ నేరాల వల్లే అత్యధిక ఆర్థిక నష్టం….

2025లో రాష్ట్రంలో నమోదైన 86,177 ప్రధాన నేరాల FIRలలో 21,639 సైబర్ నేరాలకు సంబంధించినవే. అంటే ప్రతి నాలుగు ప్రధాన నేరాల FIRలలో ఒకటి సైబర్ నేరానిదే. ఇతర ప్రధాన నేరాల వల్ల రూ.207 కోట్ల ఆర్థిక నష్టం జరగగా, సైబర్ నేరాల వల్ల రూ.1,524 కోట్ల నష్టం సంభవించింది. అంటే ఇతర ప్రధాన నేరాల కంటే దాదాపు ఏడు రెట్లు అధిక ఆర్థిక నష్టం సైబర్ నేరాల వల్లే జరుగుతోందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *