NewsInn

News in a Click

ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం ప్రారంభం

ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం ప్రారంభం

(హైదరాబాద్,న్యూస్ఇన్)

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మరింత మెరుగైన, పారదర్శకమైన, క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ లు ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT) ట్రస్ట్ డీడ్‌ను ఆవిష్కరించారు. అనంతరం న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (NEHS) వెబ్ పోర్టల్‌ను ప్రారంభించి, డౌన్‌లోడ్ చేసుకునే డిజిటల్ హెల్త్ కార్డులను విడుదల చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులకు కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం, విద్య, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. పేద ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్‌ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అమలు చేసిందన్నారు.ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మొత్తం 17,88,336 మంది లబ్ధిదారులకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. వీరిలో 4,38,594 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 3,61,955 మంది పెన్షనర్లు, సుమారు 9.88 లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 886 ప్రైవేట్ హాస్పిటల్స్‌తో పాటు 114 ప్రభుత్వ హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ పథకాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT) ద్వారా అమలు చేస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *