(హైదరాబాద్,న్యూస్ఇన్)
వివిధ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ సురక్షిత స్థానమని, తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఉత్తర భారత ప్రతినిధులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం పెట్టుబడులకు రక్షణగా నిలుస్తుందని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో సీఐఐ ఉత్తర భారత ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్నట్లే, సీఐఐ కూడా 130 ఏళ్ల నుంచి విజయవంతంగా కొనసాగుతోందన్నారు. తెలంగాణ బిడ్డ పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (LPG) ఫలితాలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నామని సీఎం అన్నారు.
ప్రభుత్వాలు మారినా తెలంగాణలో పారిశ్రామిక విధానాలను మార్చడం లేదని సీఎం అన్నారు. 1994 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు అనేక పెట్టుబడులను ఆకర్షించారని, బిల్ గేట్స్ , బిల్ క్లింటన్ లాంటి దిగ్గజాలను హైదరాబాద్ కు తీసుకువచ్చారని సీఎం గుర్తు చేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో అంతర్జాతయ ఎయిర్ పోర్టు, అవుటర్ రింగ్ రోడ్డు, ఫార్మా, ఐటీ కంపెనీలు హైదరాబాద్కు వచ్చాయన్నారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పాలనలో వాళ్లు కొన్ని పాలసీలు తీసుకువచ్చారని, వాటిని కొనసాగిస్తూనే తాము సరికొత్త పాలసీలు తీసుకువచ్చామని సీఎం తెలిపారు.

ఫార్చ్యున్ 500 కంపెనీలు భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలనేది తమ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో గత డిసెంబర్ లో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేశామని, సమ్మిట్లో 175 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని సీఎం వివరించారు. తెలంగాణ రైజింగ్ -2047 పాలసీని గ్లోబల్ సమ్మిట్ లో ప్రకటించామని సీఎం తెలిపారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా అయిదు శాతంగా ఉందని, అది10 శాతంగా ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం వెల్లడించారు.కాలుష్యంతో ఢిల్లీ, వర్షాలతో ముంబయి, ట్రాఫిక్ కష్టాలతో బెంగళూరు, ప్రకృతి వైపరీత్యాలతో చెన్నై సతమవుతున్నాయని, ఈ నేపథ్యంలో భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్గా విభజించామని సీఎం తెలిపారు.
పారిశ్రామిక విధానం బాగుంది…
తెలంగాణ పారిశ్రామిక విధానాలు చాలా బాగున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాకాలు, ఇస్తున్న మద్దతుతో జీసీసీలు హైదరాబాద్కు వరుస కడుతున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఇక్కడ ఉంది. మౌలిక వసతులు, ప్రభుత్వ సహాయ సహకారాలు మెరుగ్గా ఉండడంతోనే సమావేశానికి హైదరాబాద్ను ఎంచుకున్నాం. ఇక్కడ అధ్యయనం చేసేందుకు వచ్చామన్నారు.













Leave a Reply