NewsInn

News in a Click

కాంగ్రెస్ లోనే ఉంటాం…ఇక్క‌డా తేల్చుకుంటా…!

కాంగ్రెస్ లోనే ఉంటాం…ఇక్క‌డా తేల్చుకుంటా…!

(న్యూస్ఇన్‌, హైద‌రాబాద్)

కాంగ్రెస్ పార్టీలో ఉంటాం…ఇక్క‌డే తేల్చుకుంటామ‌ని కొండా కుటుంబం ప్ర‌క‌టించింది.గ‌త కొద్ది రోజులుగా రాష్ట్రంలో అధికార పార్టీ రాజ‌కీయాలు హాట్ హాట్ గా మారాయి. మంత్రి కొండా సురేఖ చుట్టూ కాంగ్రెస్ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి. కొండా సుష్మిత వ్యాఖ్య‌ల‌తో వేడెక్కిన తెలంగాణా రాజ‌కీయం సురేఖ మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ అయ్యే వ‌ర‌కు ప‌రిస్థితులు దారి తీశాయి. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో కొండా సురేఖ గ‌త కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉండ‌డం కూడా చ‌ర్చ‌నీయంశంగా మారింది. మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ అనంత‌రం కొండా సురేఖ‌ను బుజ్జ‌గించేందుకు పార్టీ హై క‌మాండ్ కూడా రంగంలోకి దిగింది. మీనాక్షి న‌ట‌రాజ‌న్ కొండా ఫ్యామిలీతో ట‌చ్ లోకి ఢిల్లీకి వ‌స్తే చ‌ర్చించేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించి పార్టీ ప‌రంగా మంచి ప్రాధాన్య‌త ఉన్న పోస్టును క‌ట్ట‌బెడుతామ‌న్న హామీ కూడా ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో కొండా సురేఖ త‌న అనుచ‌రుల‌తో ఈ రోజు స‌మావేశం నిర్వ‌హించి ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌స్పెన్స్ కు తాత్క‌లికంగా తెర‌దించింది. పార్టీ మారే ఆలోచ‌న లేద‌న్న సంకేతాలు ఇస్తూ… జిల్లాలో అధికార పార్టీ నేత‌ల‌ను టార్గెట్ చేశారు. బ‌సవ‌రాజు సార‌య్య‌, క‌డియం శ్రీహ‌రిల తీరును ఎండ‌గ‌ట్టారు. క‌డియం శ్రీహ‌రి ఎమ్మెల్సీ ప‌ద‌వి కోసం బీఆర్ ఎస్ లో చేరార‌ని, కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో కూతురు ఎంపీ ప‌ద‌వి కోసం కాంగ్రెస్ లో చేరార‌న్నారు. బ‌స‌వ రాజు సార‌య్య త‌న‌పై పోటీ చేస్తాన‌ని స‌వాల్ చేస్తున్నార‌ని ముందు త‌న అనుచ‌రుడి ని ఎదుర్కొని కార్పోరేట‌ర్ గా విజ‌యం సాధిస్తారా అని ప్ర‌శ్నించారు. కొండా ముర‌ళి కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. న‌మ్ముకున్న కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉండ‌డం మాత్ర‌మే త‌మ కుటుంబానికి తెలుస‌న్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి క్ష‌మాప‌ణ‌లు కోరితే స‌రిపోతుంద‌ని ఢిల్లీ పెద్ద‌లు కొండా సురేఖ ముందు ప్ర‌తిపాద‌న‌లు తెచ్చార‌ని,అయితే కొండా సురేఖ త‌ప్పుచేయ‌లేద‌ని క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోవ‌డంతోనే మంత్రి ప‌ద‌వి కోల్పోవాల్సి వ‌చ్చింద‌న్నారు. త‌మ దారి కాంగ్రెస్ లో నే తేల్చుకుంటామ‌న్నారు. త్వ‌ర‌లో త‌న‌కు ప‌ద‌వి వ‌స్తుంద‌ని కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా క‌ల్పించారు.

వినాయ‌క న‌వ‌రాత్రులు త‌మ‌కు క‌లిసి రావ‌ని కొండా దంపతులు ప్ర‌క‌టించ‌డం ఈ సంద‌ర్భంగా చ‌ర్చ‌కు దారి తీస్తోంది. వినాయ‌క నవ‌రాత్రుల అనంత‌రం భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌ను ఏమైనా ప్ర‌క‌టిస్తారా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుత‌న్నాయి. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని ఢీకొట్టేందుకు సిద్ధం అవుతున్న కొండా కుటుంబానికి ఢిల్లీ పెద్ద‌ల స‌హ‌కారం ఉందా అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి ముఖ్య నేత‌ల స‌మావేశం సంద‌ర్భంగా సీఎం పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌క‌పోవ‌డంతో ఇక భ‌విష్య‌త్తుపై ఆచి తూచి న‌డుచుకోవాల‌న్న యోచ‌న‌లో కొండా కుటుంబం ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. పీసీసీ చీఫ్ ప‌ద‌వి ఇచ్చేందుకు ఢిల్లీ పెద్ద‌లు హామీ ఇచ్చార‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. అయితే సీఎం ఈ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టేందుకు ఎంత వ‌ర‌కు స‌హ‌కరిస్తార‌న్న‌ది కూడా ఆస‌క్తి రేపుతున్న అంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *