(న్యూస్ఇన్, హైదరాబాద్)
ధరణితో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం సహా ఆ పార్టీ నేతలు కొల్లగొట్టిన భూముల వివరాలను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. కేసీఆర్, కేటిఆర్, హరీష్, కవిత, కొండల్ రావ్ లు తమ పేర్లపైకి మార్చుకున్న భూ వివరాలను బయటపెట్టారు.22ఏ వివాదంతో మొదలైన ఈ వ్యవహారం రాజకీయంగా దూమారం రేపుతోంది. అధికార, విపక్ష పార్టీలు ఇదే అంశం ఆధారంగా సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నాయి. గతంలో జరిగిన భూ రికార్డుల మార్పులు, వాటి వల్ల ఏర్పడిన సమస్యలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. గత తప్పిదాలపై సభలో చర్చ జరిగితేనే భవిష్యత్తులో పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం ఉంటుందన్నారు.
నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి 2025లో భూ భారతి వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పారు.
ప్రైవేటు భూములు, ప్రభుత్వ భూములు, అసైన్డ్, అటవీ, దేవాదాయ భూముల విషయంలో వేర్వేరు సమస్యలు ఉన్నాయని సీఎం వివరించారు. పట్టణ భూ క్రమబద్ధీకరణపై త్వరలో విధానం తీసుకొస్తామని, రిజిస్ట్రేషన్తో పాటు నాలా తదితర సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపడతామని ప్రకటించారు.

సింగరేణి ప్రాంత భూ సమస్యల కోసం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని, ఎల్బీనగర్ పరిసరాల్లో పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. జీఓ 118కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని తెలిపారు.
అసెంబ్లీలో భూముల అంశం కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా భూ రికార్డుల పారదర్శకత, నిషేధిత జాబితా, పెండింగ్ దరఖాస్తులు, పట్టణ భూ క్రమబద్ధీకరణ వంటి అంశాలు అధికార పక్షానికి సవాల్ గా మారాయి. భూ భారతి ద్వారా గత సమస్యలకు ఎంతవరకు పరిష్కారం ఈ ప్రభుత్వం చూపిస్తుందన్న చర్చ ఇప్పుడు మొదలైంది.












Leave a Reply