NewsInn

News in a Click

కాంగ్రెస్‌ 1000 రోజుల దగాపై బీఆర్‌ఎస్‌ నిరసనలు

కాంగ్రెస్‌ 1000 రోజుల దగాపై బీఆర్‌ఎస్‌ నిరసనలు

కాంగ్రెస్ పాల‌న ‘దగా’ అంటూ ఆందోళనలు

(న్యూస్ఇన్‌, హైద‌రాబాద్)

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాల‌న‌పై బీఆర్ఎస్ నిర‌స‌న‌ల‌కు సిద్ధం అవుతోంది.వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి మోసం చేసింద‌ని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై 1000 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా ఆ పార్టీ మోసాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌నుంది. సెప్టెంబర్‌ 2 నుంచి వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనుంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఈ ప్ర‌క‌ట‌న చేశారు.

100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలేవీ..

ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు డిక్లరేషన్ల పేరుతో ప్రతి ఒక్క మాటను 100 రోజుల్లోనే నెరవేరుస్తామని చెప్పి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్‌ అన్నారు. అయితే 1000 రోజులు పూర్తయినా హామీల‌ను సంపూర్ణంగా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింద‌న్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పరిపాలనా విధానాలు, వైఫల్యాలు, అవినీతి, అరాచకాలను ప్రజల ముందుంచాలని కేటీఆర్ నేత‌ల‌కు సూచించారు.
పార్టీ ఇచ్చిన హామీల బకాయిలను మరోసారి ‘బాకీ కార్డుల’ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాల‌న్నారు.

విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి…..

విద్యార్థులకు రూ.12 వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అటకెక్కించిన కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరును అన్ని కాలేజీల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లాలని కేటీఆర్‌ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమస్యను ప్రజల్లో విస్తృతంగా చర్చకు తీసుకురావాలని సూచించారు.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు, ఆడబిడ్డలు, అన్నదాతలు, గిరిజనులు, దళితులు, బీసీలు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్క వర్గాన్ని ప్రత్యేకంగా కలిసి కాంగ్రెస్‌ ప్రభుత్వ మోసాన్నిఆయా వ‌ర్గాల‌కు అర్థమయ్యేలా వారం రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

సోష‌ల్ మీడియాపై స్పెష‌ల్ ఫోక‌స్….

ప్రభుత్వ 1000 రోజుల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్‌ మీడియాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అన్నారు. సోషల్‌ మీడియాను ఒక పదునైన అస్త్రంగా ఉపయోగించుకుని వినూత్నమైన కార్యక్రమాలు, ప్రచార రూపాలతో కాంగ్రెస్‌ వైఫల్యాలను కొత్త తరానికి చేరేలా చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్లు సహా అన్ని స్థాయిల నాయకులు పాల్గొనాలని కేటీఆర్‌ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *