(న్యూస్ ఇన్, హైదరాబాద్)
ప్రభుత్వానికి బియ్యం బకాయిలు చెల్లించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్న మిల్లర్లపై తెలంగాణ పౌర సరఫరాల శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. సివిల్ సప్లైస్ శాఖ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ విభాగంలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్కు చెందిన 28 మంది కమాండోలను నియమించింది. బకాయి ఉన్న రైస్ మిల్లులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అక్రమాలను గుర్తించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలుగా వీరు పనిచేయనున్నారు.
మిల్లర్లపై ప్రత్యేక నిఘా
సివిల్ సప్లైస్ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్ శుక్రవారం సివిల్ సప్లైస్ భవన్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కొత్తగా విధుల్లో చేరిన కమాండోలకు స్వాగతం పలికి వారి విధులు, బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు.
పౌర సరఫరాల శాఖకు సంబంధించిన నిబంధనలు, చట్టపరమైన అంశాలపై కమాండోలకు ఇప్పటికే మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు కమిషనర్ తెలిపారు. నిత్యావసర వస్తువులకు సంబంధించిన చట్టాలు, శాఖ విధివిధానాలపై తెలంగాణ పోలీస్ అకాడమీలో వారికి అవగాహన కల్పించినట్లు వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు
గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కమాండోలకు ఉన్న ప్రత్యేక శిక్షణ, ఆకస్మిక తనిఖీల నిర్వహణలోని అనుభవాన్ని సివిల్ సప్లైస్ శాఖ వినియోగించుకోనుంది. వీరిని ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ విభాగం పరిధిలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలుగా ఏర్పాటు చేయనున్నారు.
ప్రభుత్వానికి బియ్యం బకాయిలు ఉన్న మిల్లులను లక్ష్యంగా చేసుకుని క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించనున్నారు. మిల్లుల్లో నిల్వలు, ప్రభుత్వ ధాన్యానికి సంబంధించిన లెక్కలు, బియ్యం అప్పగింత తదితర అంశాలను పరిశీలించే అవకాశం ఉంది.
రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ
గత సీజన్లో KMS 2025-26 సందర్భంగా తెలంగాణలో రికార్డు స్థాయిలో 154 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను సేకరించినట్లు కమిషనర్ తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.40,000 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు.
ఇంత భారీ స్థాయిలో ధాన్యం సేకరణ జరిగిన నేపథ్యంలో మిల్లింగ్, బియ్యం అప్పగింత ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని శాఖ నిర్ణయించింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు
ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించినా, పౌర సరఫరాల శాఖ నిబంధనలను ఉల్లంఘించినా ఏమాత్రం ఉపేక్షించబోమని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.












Leave a Reply