NewsInn

News in a Click

సంగారెడ్డికి సరిపడా మిషన్ భగీరథ నీరు ఇవ్వండి

రివ్యూలో జ‌గ్గారెడ్డి అధికారులకు సూచ‌న‌లు

రోజు 8.5 ఎం.ఎల్.డి నీటి కేటాయింపు కలెక్టర్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

సంగారెడ్డి మున్సిపాలిటీ కి మిషన్ భగీరథ నీటి సరఫరా విషయం పై కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నిర్మల, కూన సంతోష్ సమక్షం లో జరిగిన ఈ సమీక్ష సమావేశం లో మిషన్ భగీరథ, మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులు పాల్గొన్నారు. గత కొద్ది నెలలుగా సంగారెడ్డి పట్టణ పరిధి లో మిషన్ భగీరథ నీరు పూర్తి స్థాయిలో సరఫరా జరగడం లేదని కూన సంతోష్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

సంగారెడ్డి మున్సిపాలిటీకి మిషన్ భగీరథ నుండి 9 ఎం.ఎల్.డి నీటి సరఫరా అగ్రిమెంట్ ఉండగా గత కొద్ది నెలల నుండి కేవలం 7 ఎం.ఎల్.డి మాత్రమే సరఫరా అవుతుందని కలెక్టర్ కు వివరించారు. దీనితో సంగారెడ్డి న్యూ టౌన్ కు నీటి సరఫరా లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. ఈ విషయమై మిషన్ భగీరథ అధికారులు వివరణ ఇస్తూ సింగూర్ ప్రాజెక్ట్ నుండి నీరు సరఫరా చేసే 9 పంపులలో ప్రస్తుతం ఏడు పంపులు నడుస్తున్నాయని, త్వరలో ఎనిమిదో పంప్ అందుబాటులోకి వస్తుందని అప్పుడు సరఫరా కు ఇబ్బందులు ఉండవని వివరించారు. ప‌రిస్థితుల్లో మార్పు రాక‌పోతే రాబోయే వేస‌వి కాలంలో నీటి ఎద్ద‌డి వ‌స్తుంద‌ని జ‌గ్గారెడ్డి హెచ్చ‌రించారు. క్రమం తప్పకుండా సంగారెడ్డి పట్టణానికి 8.5 ఎం.ఎల్.డి నీటి సరఫరా చేసేలా చూడాలని కలెక్టర్ మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ఈ నీటి సరఫరా కు అదనంగా రాజంపేట్ పంప్ హౌజ్ నుండి వెలుగు ఆఫీస్ పంప్ హౌజ్ వరకు గతంలో ఉన్న ఇంటర్ కనెక్టివిటీ లైన్ ను పునరుద్ధరించాలని జగ్గారెడ్డి కలెక్టర్ ను కోరారు. తద్వారా మిషన్ భగీరథ కు అదనంగా నీటి సరఫరా జరుగుతుందని, సంగారెడ్డి మున్సిపాలిటీ కి భవిష్యత్తు లో నీటి ఇబ్బందులు ఉండవని వివరించారు. లైన్ పునరుద్దరణ కు రూ.40 లక్షలు ఖర్చవుతుందని మున్సిపల్ అధికారులు తెలుపగా, వెంటనే ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *