(న్యూస్ఇన్,హైదరాబాద్)
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ పిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హై కోర్టు షాక్ ఇచ్చింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గతంలో ఇచ్చిన తీర్పుతో సంబంధం లేకుండా కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపు కింద ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది. బీఆర్ ఎస్ పార్టీ నుంచి 2023 ఎన్నికల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించిన దానం నాగేందర్ రాష్ట్రంలో అధికార పార్టీగా కాంగ్రెస్ అవతరించండంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశాన్ని గులాబీ పార్టీ అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తూ హై కోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించింది. సుప్రీం కోర్టు డెడ్ లైన్ విధించడంతో అసెంబ్లీ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఉన్న పిటీషన్లపై నిర్ణయం తీసుకున్నారు. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఆధారాలు లేవని తీర్పు వెలువరించారు.దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారు.సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ విచారణ చేపట్టి దానం నాగేందర్ను అనర్హుడిగా ప్రకటించేందుకు తగిన కారణాలు లేవని నిర్ణయించారు. అయితే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు.
కానీ ఈ కేసును విచారించిన హై కోర్టు ఈ రోజు దానం నాగేందర్ విషయంలో కీలక తీర్పు ఇచ్చింది.నాగేందర్ ఎమ్మెల్యే పదవిని రద్దు చేసింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లుగా ప్రకటించింది.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే పార్టీ మారడం, మరో పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై బీఆర్ఎస్ తమ వాదనలను హై కోర్టులో వినిపించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు.

తాజాగా ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, న్యాయమూర్తి జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి దానం నాగేందర్పై అనర్హత వేటు వేసింది. ఈ అనర్హత 2024 ఏప్రిల్ 23 నుంచి అమల్లోకి వస్తుందని కోర్టు పేర్కొన్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా పరిగణించి సంబంధిత అధికారులకు ఆదేశాలు పంపాలని కోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.
హై కోర్టు తీర్పుతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలపై ఆసక్తి నెలకొంది. హై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు దానం నాగేందర్ వ్యాఖ్యానించడం విశేషం. ప్రజల అభిమానంతో ఉప ఎన్నికలను ఎదుర్కొని విజయం సాధించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. అయితే హై కోర్టు తీర్పుపై కాంగ్రెస్ హై కమాండ్ ఎలా స్పందిస్తున్నది కూడా ఆసక్తి రేపుతోంది. దానం అనర్హత పై సుప్రీం కోర్టుకు వెళుతుందా…ఉప ఎన్నికల ద్వారా మరోసారి ప్రభుత్వం తమకు ప్రజల్లో ఆదరణ ఉందని నిరూపించుకునేందుకు సిద్ధం అవుతుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది.













Leave a Reply