NewsInn

News in a Click

దక్షిణాది డీజీపీల సదస్సు-తెలంగాణ ఆతిథ్యం

దక్షిణాది డీజీపీల సదస్సు-తెలంగాణ ఆతిథ్యం

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్)

దక్షిణాది రాష్ట్రాల డీజీపీల ప్రాంతీయ సదస్సుకు తెలంగాణ ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను డీజీపీ ఆదేశించారు. అక్టోబరులో జరగనున్న ఈ సదస్సులో సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వామపక్ష తీవ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, తీర ప్రాంత భద్రత, నేర ధోరణులు తదితర అంశాలపై చర్చించనున్నారు.

పోలీసు సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమంపై దృష్టి సారిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ‘ఫిట్‌ కాప్‌’ కార్యక్రమాన్ని అమలు చేయాలని డీజీపీ నిర్ణయించారు. ఇందులో ప్రాథమిక ఆరోగ్య పరీక్షలతోపాటు థైరాయిడ్‌, మధుమేహం, పోషకాహారం, ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించనున్నారు. ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించి అవసరమైన వైద్య సహాయం అందించనున్నారు. తెలంగాణ పోలీసుశాఖలో చేపట్టిన సిబ్బంది పునర్వ్యవస్థీకరణ, వనరుల హేతుబద్ధీకరణతో ప్రభుత్వానికి భారీగా ఆదా అయింది. గ‌త కొన్ని నెల‌ల్లోనే దాదాపు 90 కోట్ల రూపాయాలు ఆదా అయింద‌ని డీజీపీ వెల్ల‌డించారు.

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవo …..

అక్టోబరు 21న నిర్వహించే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని డీజీపీ ఆదేశించారు. రక్తదాన శిబిరాలు, ఓపెన్‌హౌస్‌లు, సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాల దుర్వినియోగం, బాలల భద్రత తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పోలీసుల త్యాగాలను ప్రజలకు తెలియజేయడంతోపాటు పోలీసు శాఖకు, సమాజానికి మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమాల ఉద్దేశమని డీజీపీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *