(న్యూస్ఇన్, హైదరాబాద్)
రైతుల ఆదాయాలను పెంచడంతో పాటు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. హైదరాబాద్లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు.దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయ పరిస్థితులపై సదస్సులో చర్చించారు. పంటల వైవిధ్యీకరణ, ఎల్నినో ప్రభావం, రానున్న రబీ సీజన్ ప్రణాళికలపై సదస్సులో ప్రధానంగా చర్చ జరిగింది.రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందన్నది వ్యవసాయ రంగానికి కేంద్రం అందించే సహకారానికి అడ్డంకి కాదని శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. దేశమే మొదటి ప్రాధాన్యం అనే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని చెప్పారు. వ్యవసాయ సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.ఆధునిక సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా వ్యవసాయానికి ప్రత్యామ్నాయం కాదని చౌహాన్ పేర్కొన్నారు.

ఆహార, పోషక భద్రతకు ప్రాధాన్యం…
వ్యవసాయ రంగానికి మూడు లక్ష్యాలు ఉన్నాయని మంత్రి వివరించారు. దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించడం, రైతుల జీవనోపాధిని భద్రపరచడం, ప్రజలకు పోషకాహార భద్రత అందించడం ముఖ్యమన్నారు. రైతుల ఆదాయాలు పెరగడం వ్యవసాయ విధానాల్లో కీలక అంశంగా ఉండాలన్నారు. దక్షిణ భారతదేశంలో ఉద్యాన పంటలకు అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. కొబ్బరి, జీడిపప్పు, కోకో, కాఫీ, సుగంధ ద్రవ్యాలు వంటి పంటల ద్వారా రైతులకు అధిక ఆదాయం వచ్చేలా రాష్ట్రాలు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు…..
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వాతావరణం, నేల స్వభావం, నీటి లభ్యత, పంటల పరిస్థితులు ఒకేలా ఉండవని చౌహాన్ అన్నారు. అందువల్ల ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.పాత చట్టాలు, విధానాల్లో మార్పులు అవసరమైతే రాష్ట్రాలు కేంద్రానికి సూచనలు చేయాలని కేంద్ర మంత్రి కోరారు.

ప్రపంచ మార్కెట్లతో రైతులకు అవకాశాలు….
భారత్ పలు దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు పెరుగుతున్నాయని చౌహాన్ తెలిపారు. ప్రపంచ మార్కెట్ అవసరాలను గుర్తించి, అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను అందుబాటులోకి తేవాలని సూచించారు.
తెలంగాణకు 2 లక్షల ఇళ్లు….
గ్రామీణాభివృద్ధి అంశాన్ని ప్రస్తావించిన చౌహాన్.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ కింద తెలంగాణకు రెండు లక్షల ఇళ్ల నిర్మాణానికి తొలి విడత నిధులు అందజేసినట్లు తెలిపారు. సర్వేలో గుర్తించిన అర్హులైన లబ్ధిదారులను తదుపరి దశల్లో కూడా పథకంలో చేర్చుతామని చెప్పారు. కేంద్రం తెలంగాణకు అన్ని రంగాల్లో సహకారం అందిస్తుందని వెల్లడించారు.













Leave a Reply