NewsInn

News in a Click

క్రెడిట్ చోరీ అంటున్న వారికి ఏం క్రెడిట్ ఉంది

క్రెడిట్ చోరీ అంటున్న వారికి ఏం క్రెడిట్ ఉంది

అమరావతి అభివృద్ధి ఆగదు

స్వచ్ఛాంధ్రలో భాగంగా రూ. 573 కోట్లతో అభివృద్ధి

వచ్చే ఎన్నికల నాటికి నగరికి కృష్ణా జలాలు

సీఎం చంద్రబాబు

(అమ‌రావ‌తి,హైద‌రాబాద్)

నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో గత ఐదేళ్లూ చూశామని, మంచి-చెడుకి వ్యత్యాసం ఏంటో ప్రజలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. చెడ్డ వ్యక్తులను ప్రోత్సహిస్తే సమాజానికి హాని జరుగుతుందని, స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే భవిష్యత్ బాగుంటుందని అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో స్వర్ణాంధ్ర –స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వ్యర్ధాల సేకరణ కోసం ఉద్దేశించిన స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. ప్రజా వేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లతో పాటు మెప్మా, డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. పలువురు పారిశుద్ధ్య కార్మికుల సేవలను అభినందిస్తూ సన్మానించారు. అనంతరం ప్రజా వేదిక సభలో పాల్గొని ప్రసంగించారు. స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో మొత్తం రూ.573 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నాం. స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0లో భాగంగా సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కింద 101 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులను రూ.510 కోట్లతో చేపడుతున్నాం. రూ.2.21 కోట్ల విలువైన 9,048 హోం కంపోస్టింగ్ బిన్స్ హౌస్ హోల్డ్ వేస్ట్ ప్రాసెసింగ్ కోసం మెప్మా ఆర్పీలకు సమకూర్చడం జరిగింది.స్వచ్ఛ రథాలతో మీ ఇళ్లలోని డ్రై వేస్ట్, ప్లాస్టిక్, కాగితాలు వంటివి తీసుకుని నిత్యావసరాలు ఇస్తున్నాం. ఇప్పటివరకు 30 స్వచ్ఛరథాలు ఉన్నాయి. మరో 70 మార్చి నాటికి ప్రవేశ పెడతామని ముఖ్యమంత్రి తెలిపారు.

ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ…

ప్రజలందరి సహకారంతో ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీని తయారుచేయాలని సంకల్పించాం. 2018లోనే ఓడీఎఫ్ రాష్ట్రంగా ఏపీని నిలిపాం. ఇప్పుడు ఓడీఎఫ్ ప్లస్‌ రాష్ట్రంగా ఈ మార్చికి తీర్చిదిద్దుతామ‌ని ప్ర‌క‌టించారు. రాష్ట్ర సచివాలయంతో సహా 17 పట్టణ, నగరపాలక సంస్థల కార్యాలయాలు ఇప్పుడు పూర్తిగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిలిపేశాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల్లో పరిశుభ్రత, క్రమశిక్షణ పెంపొందించడమే లక్ష్యంగా ముస్తాబు కార్యక్రమం అమలు చేస్తున్నాం.రాష్ట్రంలో హోమ్ కంపోస్టింగ్, కిచెన్ గార్డెన్లు, టెర్రస్ గార్డెన్ల సంఖ్య పెరిగిందని చెప్పారు.

కుప్పం తరహాలో నగరి అభివృద్ధి…

నగరి నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట. నా మిత్రుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు అనునిత్యం నగరి ప్రజల కోసం తపించేవారు. నగరిలో ఆ ఐదేళ్లూ అభివృద్ధి అంటే తెలియదు. ఇప్పుడు మంచి రోజులు మొదలయ్యాయి. 2029 ఎన్నికల నాటికి నగరికి కృష్ణా జలాలు తీసుకొచ్చే బాధ్యత నాది. అలాగే ఇక్కడి ప్రజలు వలసలు వెళ్లకుండా పరిశ్రమలు తీసుకొస్తాం. కుప్పం తరహాలో నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *