(అమరావతి, న్యూస్ఇన్)
రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూర్చేలా, ఎంట్రప్రెన్యూర్లుగా ఎదిగేందుకు దోహదం చేసేలా పారిశ్రామికీకరణ జరగాలని… ఆ దిశగా పెట్టుబడులను ఆకర్షించాలాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా భవిష్యత్లో పెరిగే ఇథనాల్ డిమాండ్ను అందిపుచ్చుకోవాలని చెప్పారు. ఇథనాల్ బ్లెండింగ్ 40 శాతానికి పెంచితే… మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. ఇథనాల్ తయారీ రంగంలో వచ్చే అన్ని పెట్టుబడులను ప్రోత్సహించాలన్నారు. పెట్రోలు, డీజిల్లో మిక్స్ చేసేందుకు ఇథనాల్ భారీగా అవసరం కానుందన్నారు. ఇథనాల్, మీథేన్, ఏవియేషన్ ఫ్యూయల్కు సంబంధించి పాలసీ తీసుకురావాలని ఈ సందర్బంగా అధికారులను ఆదేశించారు. సంపద సృష్టి, సర్క్యులర్ ఎకానమీ అనేది ప్రభుత్వ విధానం అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను పెద్దఎత్తున ప్రోత్సహించాలని నిర్దేశించారు. సచివాలయంలో మంగళవారం 19వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు. ఈ సమావేశంలో మొత్తం 11 ప్రాజెక్టులకు సంబంధించి రూ.9,076.11 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. దీంతో 10,531 ఉద్యోగాలు రాష్ట్రానికి రానున్నాయి.

100 ఎక్స్పీరియన్స్ సెంటర్ల ఏర్పాటు లక్ష్యం….
పర్యాటకరంగంలో అపార అవకాశాలు ఉన్నాయి. తిమ్మమ్మ మర్రిమాను సహా రాష్ట్రవ్యాప్తంగా 100 టూరిస్ట్ స్పాట్ల దగ్గర ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. పోలవరం, దిండి, గండికోట, కంబం చెరువు, లంబసింగి లాంటి ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. లంబసింగి, అరకు సమీపంలో రిసార్ట్ ఏర్పాటుకు జిందాల్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేస్తోంది. ఏటికొప్పాక, కొండపల్లి , ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడ, పొందూరు కళారూపాల్ని కూడా తీర్చిదిద్దాలి.
సోలార్ సెల్స్ తయారీలో అగ్రగామి కావాలి..
రెన్యువబుల్ ఎనర్జీ విస్తృతం కావడంతో సోలార్ సెల్స్ తయారీ పరిశ్రమలను ఆహ్వానించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. సోలార్ సెల్స్లో ఏపీ అగ్రగామిగా నిలవాలన్నారు. ఇంకా ఏర్పాటు చేయాల్సిన 38 ఎంస్ఎంఈ పార్కులను త్వరితగతిన ప్రారంభించాలని నిర్దేశించారు. రైల్వే టెర్మినల్స్కు ఎంస్ఎంఈ పార్కులను ఇంటిగ్రేట్ చేయాలన్నారు. లాజిస్టిక్స్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లతో యువతకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు గ్రీన్ ఎనర్జీ వినియోగించేలా చూడాలన్నారు.












Leave a Reply