NewsInn

News in a Click

రాష్ట్ర ఖ‌జానా నిల్..కాంగ్రెస్ నేతల జేబులు ఫుల్!

  • ఆర్ధిక ప‌రిస్థితిపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాలి
  • కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి సీఎం రేవంత్ కు బ‌హిరంగ లేఖ‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టో ద్వారా 6 ప్రధాన గ్యారంటీలతో పాటుగా 420 హామీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. ఈ హామీలను నమ్మిన తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టింది. అనంతరం ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మీరు, ఇచ్చిన హామీలను అమలు చేయమంటే రాష్ట్ర ఖజానాలో లంకెబిందెలకు బదులు ఖాళీ మట్టి కుండలు ఉన్నాయంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఇచ్చిన హామీల అమలునుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ఖజానా గురించి ఇలా మాట్లాడిన మీరే, ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ సోనియా గాంధీ-రాహుల్ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే రూ. 1,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మీరు మాట్లాడిన తీరును చూస్తుంటే, రాష్ట్ర ఖజానా నిల్ – కాంగ్రెస్ నాయకుల జేబులు ఫుల్ అన్న విషయం అర్థమవుతోంది. కేంద్ర ప్ర‌భుత్వం గత 12 సంవత్సరాల కాలంలో దాదాపు రూ. 12 లక్షల కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరియు ప్రజల సంక్షేమానికి కేటాయించింది.

అన్ని రాష్ట్రాలలాగే తెలంగాణ రాష్ట్రం కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలకు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ రహిత ఋణాల మీద ఆధారపడటం చూస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలాంటి దుస్థితిలో ఉందో తెలుస్తోంది. ఇవి మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న ఋణాలకు వడ్డీలు చెల్లించడానికి ఋణాలు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఋణాలు, రైతు భరోసా నిధులకు ఋణాలు, సంక్షేమ పథకాల అమలుకు ఋణాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఋణాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి నేడు తెలంగాణలో ఉంది.

2014 లో మిగులు నిధులతో ఏర్పడిన రాష్ట్రానికి గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో, గత 27 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు పట్టిన దుస్థితికి నేటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్ధం పడుతోంది. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పెరుగుతున్న రాష్ట్ర తలసరి అప్పు కూడా రాష్ట్ర ఆర్థిక దుస్థితిని తెలియజేస్తోంది. ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను తెలంగాణ ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.

కాబట్టి, మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఒక పూర్తిస్థాయి శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని తెలంగాణ ప్రజల తరపున మిమ్మల్ని కోరుతున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *