(న్యూస్ఇన్, న్యూఢిల్లీ)
మూల పురుషుడి ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి పృథ్వి ఉద్భవించాయని తైత్తిరీయ ఉపనిషద్ ప్రవచిస్తున్నది. ఈ పంచభూతాల సృష్టే మానవ జీవితం. పంచభూతాల నుంచి ఉద్భవించిన మానవుడు తిరిగి ధరిత్రిలోనే లీనమైపోతాడు. తిరిగి పంచభూతాల ద్వారా మరో జన్మ పొందుతాడు. కాబట్టి మన జననం..జీవనం.. జీవనయానం..మరణం అన్నీ ప్రకృతి ఆధారాలైన పంచభూతాలతో ముడిపడి ఉన్నందున పర్యావరణంతో మరింత మమేకమయ్యేలా మన జీవితాలను మలుచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. సమస్త ధరిత్రి అంతా వృక్షమయమైనప్పుడే మనందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని చెప్పారు. గురువారం రాష్ట్రపతి భవన్ లో .. రాజ్యసభ మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ రూపొందించిన వృక్ష వేదం 2.0 పుస్తకాన్ని ఆమెకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, సురేశ్ రెడ్డి, పార్థసారథి రెడ్డి, పర్యావరణ స్వచ్ఛంద సంస్థ ఇగ్నైటింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు ఎం కరుణాకర్ రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ సహ వ్యవస్థాపకుడు సంజీవుల రాఘవేంద్ర పాల్గొన్నారు.
గ్రీన్ ఇండియా సేవలు భేష్ ….
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ..మనిషి స్వార్థం, లాభాపేక్షలు వీడి పంచభూతాలను గౌరవిస్తూ బతికితే ఆపదలు సంభవించే కాలం మాయమై మన జీవితం అమృత కాలంతో సుభిక్షంగా ఉంటుందన్నారు.ప్రకృతి సంరక్షణ కోసం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలోని గ్రీన్ ఇండియా చాలెంజ్ చేస్తున్న వినూత్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకమని ప్రశంసించారు. కేవలం 8 ఏళ్ల కాలంలోనే 19 కోట్ల మొక్కలు నాటేలా స్ఫూర్తిని నలుదిక్కులకు వ్యాపింపజేసిన సంతోష్ కుమార్ అసలైన పర్యావరణ పరిరక్షకుడని కితాబునిచ్చారు.

హరితహారం స్ఫూర్తితో…
పర్యావరణంలో నిజమైన మార్పును తీసుకురావాలనే తపనతో జోగినపల్లి సంతోష్ కుమార్ 2018 జూలై 17న గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. హరా హై తో భరా హై అనే నినాదంతో ప్రారంభమై.. పర్యావరణ రక్షణ ప్రజా బాధ్యతగా మారడంలో కీలక పాత్ర వహించింది. అయితే తెలంగాణలో కేవలం 24 శాతంగా ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచి గ్రీన్ స్టేట్ గా మార్చాలనే సంకల్పతో 2015 జూలై 3న నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన తెలంగాణకు హరిత హారమే..గ్రీన్ ఇండియా చాలెంజ్ కు స్ఫూర్తిగా నిలిచింది. తొలుత హైదరాబాద్ నగరంలో ఈ కార్యక్రమం మొదలైంది. సాధారణ ప్రజలు, సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు అందరూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడంలో భాగస్వాములయ్యారు. క్రమేపి ఈ ఉద్యమం పట్టణాలు, గ్రామాలకు విస్తరించింది. దేశ, విదేశాల్లో కూడా అనేక మంది ప్రముఖులను ఆకర్షించి వారు కూడా మొక్కలు నాటేలా ప్రేరేపించింది. ఇటీవలే పశ్చిమ బంగలోని సుందర్ బన్ మడ అడవుల్లో పచ్చదనం పెరిగేలా సంతోష్ కుమార్ ఓ బాధ్యతను తలకెత్తుకున్నారు. స్థానికుల సహకారంతో 20వేల మొక్కలను పెంచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఎనిమిదేళ్లలో ఆయా ప్రాంతాల్లో దాదాపుగా 19.6 కోట్ల మొక్కలు నాటేలా గ్రీన్ ఇండియా చాలెంజ్ స్పూర్తినిచ్చింది. 2021 ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్వహించిన కోటి వృక్షార్చన ఈ ఉద్యమంలో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోష్ కుమార్ కు అభినందనలు తెలియజేయడం గమనార్హం.








Leave a Reply