
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఆర్టీసి కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా తొలిరోజు విజయవంతం కావడంతో రెండో రోజు చేపట్టాల్సిన కార్యక్రమాలపై జేఏసీ దృష్టి పెట్టింది. గురువారం ఉదయం నుంచే అన్ని డిపోల ముందు మహాధర్నాలు నిర్వహించాలని జేఏసీ పిలుపు నిచ్చింది. ఉ.5గంటల నుంచి మహా ధర్నాలను కార్మికులు మొదలు పెట్టనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని , 30 శాతం తగ్గకుండా 2021 వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఇతర జోన్లకు ఉద్యోగులను బదిలీ చేసే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలన్నారు. కార్మిక సంఘాలను పునరుద్ధరించి వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు తాము సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.






Leave a Reply