సేఫ్టీ ఎక్స్లెన్స్ అవార్డు అందించిన ఏ పీ జెన్కో
(అమరావతి,న్యూస్ఇన్)
పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్(ఎం ఈ ఐ ఎల్ ) 25 మిలియన్ల సేఫ్ మాన్ అవర్స్ ధ్రువపత్రాన్ని సాధించింది. ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు ఒక్క పని దినం కూడా వృధా కాకుండా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుని పని చేసినందుకు ఏ పీ జెన్ కో ఈ ధ్రువపత్రాన్ని ఎం ఈ ఐ ఎల్ కు అందచేసింది. ఈ ధ్రువపత్రాన్ని ఎం ఈ ఐ ఎల్ అసోసియేట్ మేనేజర్ ప్రగడ నంద నాగ కృష్ణ బుధవారం జెన్ కో ఎస్ఈ కే రామభద్రరాజు నుంచి అందుకున్నారు.

2020లో ఎం ఈ ఐ ఎల్ పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్ట్ లో కీలకమైన సివిల్, మెకానికల్ పనులను ఎలాంటి అవాంతరాలు లేకుండా చేస్తోంది. ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా కార్మికులు, సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. అందువల్లే సేఫ్ మాన్ అవర్స్ ధ్రువపత్రాన్ని సాదించగలిగామని పోలవరం జల విద్యుత్ కేంద్రం ఎం ఈ ఐ ఎల్ జనరల్ మేనేజర్ ప్రసేన్ జిత్ మజుందార్ , భద్రతా విభాగం ఇంచార్జి సబ్యసాచి రానా తెలిపారు. ఈ సందర్భంగా ఏ పీ జెన్ కో ఎస్ఈ కె రామ భద్రరాజు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ లో భాగమైన జల విద్యుత్ కేంద్రం పనులు ఒక ప్రణాళిక ప్రకారం ఎలాంటి అవాంతరాలు లేకుండా జరుగుతున్నాయని తెలిపారు . పని ప్రాంతంలో కార్మికులు సురక్షితంగా ఉండేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామని, నిర్మాణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ ఈ విషయంలో రాజీ పడటం లేదన్నారు. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక ముందు కూడా ఎలాంటి ప్రమాదాలు లేకుండా ప్రాజెక్ట్ నిర్మాణపనులు కొనసాగిస్తామని తెలిపారు.



Leave a Reply