NewsInn

News in a Click

ఏపీ 3 రీజియ‌న్లుగా అభివృద్ధి:చంద్రబాబు

ఏపీ 3 రీజియ‌న్లుగా అభివృద్ధి:చంద్రబాబు

(అమరావతి, న్యూస్ఇన్‌)

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని రీజియ‌న్ల వారిగా అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్ర‌ణాళిక‌లు ర‌చించాల‌ని సీఎం చంద్ర‌బాబు సూచించారు.ఉద్యానవన పంటల సాగుతో తలసరి ఆదాయంలో సరికొత్త రికార్డ్ సృష్టించిన కడప జిల్లా లింగాలం మండలం స్ఫూర్తితో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. తిరుపతి ఎకనామిక్ రీజియన్ పురోగతికి హార్టికల్చర్ గ్రోత్ ఇంజిన్ అవుతుందని…25కు పైగా ఉద్యాన ఉత్పత్తులు సాధించేలా చూడాలన్నారు. ఈ ప్రాంత స్థితిగతులు మార్చే శక్తి హార్టికల్చర్‌కు ఉందని…తిరుపతి ఎకనామిక్ రీజియన్ మాస్టర్ ప్లాన్‌లో రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించారు. పూర్వోదయ పథకం కింద రూ.40,000 కోట్లు, ప్రైవేట్ పెట్టుబడుల రూపంలో వచ్చే మరో రూ.60,000 కోట్లు ఉద్యానవన రంగానికి ఊతమిస్తాయని అధికారులకు సీఎం చెప్పారు. పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాల కన్నా…సీమలోని ఓ మండలంలో ప్రజల తలసరి ఆదాయం అధికంగా ఉండటాన్ని అధ్యయనం చేయాలని సీఎం అన్నారు. కడప జిల్లా లింగాల మండలంలో ప్రజలు రూ. 7.30 లక్షలు తలసరి ఆదాయం కలిగి ఉండడం హార్టికల్చర్ పంటల సాగు వల్ల కలిగే లాభాలకు నిదర్శనమని సీఎం స్పష్టం చేశారు. హార్టికల్చర్ కు అత్యంత అనువైన రాయలసీమలో ఆ దిశగా ప్రజలను మరింత ప్రోత్సహించాలన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా 3 రీజియన్ల అభివృద్ధికి కార్యాచరణపై పలు మార్గదర్శకాలను సూచించారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీలు

అమరావతి, తిరుపతి, విశాఖలో అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపోందించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో మూడు ప్రాంతాల్లోనూ స్పోర్ట్స్ సిటీల అభివృద్ధి జరగాలన్నారు. ఏపీకి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతంలో సూర్య లంక సహా వివిధ ప్రాంతాల్లోని బీచ్ ఫ్రంట్ లను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. సూర్య లంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సీఎం నిర్దేశించారు. తీరప్రాంత పర్యాటకం, గ్లోబల్ బిజినెస్-ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్, గ్లోబల్ టాలెంట్-ఎలైట్ లివింగ్ అనే 3 పిల్లర్లపై ‘వైజాగ్ బే సిటీ’ అభివృద్ధి చేయాలన్నారు.

అమరావతి ఎకనామిక్ రీజియన్

రాష్ట్ర జనాభాలో 32 శాతం అమరావతి ఎకనామిక్ రీజియన్‌లో నివసిస్తున్నారని… భౌగోళికంగా 33 శాతం విస్తరించి ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. భౌగోళికంగా రాష్ట్రానికి మధ్యలో ఉండటం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉండటం ఏఈఆర్‌కు కలిసొచ్చే అంశమని అన్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం…మొత్తం 9 జిల్లాలు అమరావతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో ఉండగా… వీటిలో అన్నింటికన్నా కృష్ణా జిల్లా తలసరి ఆదాయంలో ముందుందని అధికారులు చెప్పారు.

ఏఈఆర్‌తో పోటీపడేలా టీఈఆర్

ఖనిజ సంపద నుంచి హార్టికల్చర్ వరకు…ఫుణ్యక్షేత్రాల నుంచి పర్యాటక ప్రాంతాల వరకు రాయలసీమకు ఉన్న అనుకూలతను మార్కెటింగ్ చేసుకోవాలని సీఎం అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పనిచేస్తే పెద్దఎత్తున పెట్టుబడులు… తద్వారా యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. విశాఖ, అమరావతి రీజియన్లతో పోటీ పడేలా తిరుపతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి జరగాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *