మోదీ వ్యాఖ్యలు దురదృష్టకరం….
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం తప్పనిసరి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ హక్కుల కోసం తాము కేంద్రంతో పోరాడుతామని వ్యాఖ్యానించారు.సీఎం రేవంత్రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ చిట్చాట్లో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ విధానాలు, రాష్ట్ర అభివృద్ధి, మావోయిస్టుల సరెండర్లు, మహిళా రిజర్వేషన్లు, రీజినల్ రింగ్ రోడ్, బండి భగీరథ్ కేసు వంటి అనేక కీలక అంశాలపై స్పందించారు.బండి భగీరథ్ కేసు దర్యాప్తులో వేగం పెంచామన్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మే 8న ఎఫ్ఐఆర్ నమోదైందని, ప్రధాని మోదీ పర్యటన భద్రతా ఏర్పాట్ల కారణంగా విచారణ ఆలస్యమైందని వివరించారు. ఇప్పుడు దర్యాప్తు వేగవంతం చేశామని, సీనియర్ మహిళా అధికారిని విచారణాధికారిగా నియమించినట్లు చెప్పారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. ఎవరినీ ఇప్పటివరకు వదిలిపెట్టలేదని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.బీజేపీని ‘బ్రిటిష్ జనతా పార్టీ’గా సీఎం రేవంత్రెడ్డి అభివర్ణించారు. ఎస్ఐఆర్ను బీజేపీ ఆయుధంగా ఉపయోగిస్తోందని మండిపడ్డారు. పశ్చిమబెంగాల్ లో 90 లక్షల ఓట్లను తొలగించారని ఆరోపించారు. కేరళం, తమిళనాడు ఎన్ని సీట్లు గెలిచిందో అందరికీ తెలిసిందన్నారు. బీజేపీ గెలుచుకుందని ప్రస్తావించారు. ఏ రాష్ట్రంలో గెలవాలంటే అక్కడ బీజేపీ ఎస్ఐఆర్ను ప్రయోగిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్ రాలేదని.. మున్సిపాలిటీల్లో బీజేపీ పరిస్థితి ఏమిటని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు.
అభివృద్ధి అంశాలపైనే చర్చ….
ఈ కార్యక్రమంలో తాను ప్రస్తావించిన అభివృద్ధి అంశాలను ప్రధాని మోదీ అంగీకరించారని సీఎం తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర సహకారం అవసరమని, అదే విషయాన్ని మోదీ దృష్టికి తాను తీసుకెళ్లానని చెప్పుకొచ్చారు. ‘నేను బీజేపీని ఓడించిన ముఖ్యమంత్రిని. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని నిధులు అడగలేదని, తాము మాత్రం తెలంగాణ హక్కుల కోసం అడుగుతున్నామని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో ప్రధాని మోదీ సమావేశం కావడం ప్రైవేట్ కార్యక్రమమని చెప్పుకొచ్చారు.

మోదీ వ్యాఖ్యలు దురదృష్టకరం….
ప్రధాని మోదీ మాట్లాడిన కొన్ని మాటలు దురదృష్టకరమని సీఎం అభిప్రాయపడ్డారు. ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మతాలు, కులాలు, మావోయిస్టులు దేశ ప్రజలు కారా.. అందరికీ సమాన హక్కులు ఉన్నాయని తెలిపారు. బీజేపీ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్లను ఖతం చేయడమ వాళ్ల విధానమని మండిపడ్డారు. తమ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్లను ఒప్పించి జనజీవనంలో కలపడం తమ విధానమని ఉద్ఘాటించారు. మనుషులను చంపడం పరిష్కారం కాదని.. ముస్లింలు, మావోయిస్టులు కూడా ఈ దేశ భాగస్వాములేనని అన్నారు. దేశంలో ఐక్యత పెంచేలా ప్రధాని మాట్లాడాలని, విడదీసేలా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని చెప్పారు. ఇది బీజేపీ వివక్ష రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు.
కేంద్రంపై విమర్శలు..
బంగారం కొనొద్దు, విమానాల్లో ప్రయాణం చేయొద్దని ప్రజలకు చెప్పడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని సీఎం పేర్కొన్నారు. విదేశాంగ విధానంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రతిపక్షాల సూచనలు తీసుకోవాలని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని కేంద్రానికి సూచించారు. మోదీ అనుభవరాహిత్యం, అహంకారం వల్ల దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని ఆరోపించారు.
తుమ్మిడిహట్టి పై లేఖ…
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అంశంపై ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు సీఎం వెల్లడించారు. మహారాష్ట్ర సీఎం స్పందించేలా చూడాలని ప్రధాని మోదీకి కూడా లేఖ పంపినట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రధాని పెద్దరికం వహిస్తే మంచిదని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ద్వారా కూడా చర్చలు జరిపించాలని కోరారు.











Leave a Reply