(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కి కొరత లేదని చమురు సంస్థలు ప్రకటన విడుదల చేశాయి. డిమాండ్కు అనుగుణంగా అందుబాటులో ఉందని, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కొరత లేదని చమురు కంపెనీలు (ఓఎంసీలు) స్పష్టం చేశాయి. సరఫరాను ప్రభుత్వ రంగ ఓఎంసీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, రవాణా, సరఫరా సేవలను మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పత్రికా ప్రకటనలో ఓఎంసీల రాష్ట్ర కో-ఆర్డినేటర్ వెల్లడించారు. ఈ నెల మొదటి 15 రోజుల్లోనే పెట్రోల్ సరఫరాలో 14.2 శాతం, డీజిల్ సరఫరాలో 15.7 శాతం వృద్ధిని ఓఎంసీలు నమోదు చేశాయి.
ఎల్పీజీ బుకింగ్ తగ్గింది…….

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా గృహావసర ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్స్ తగ్గుముఖం పట్టాయి. తెలంగాణలో ఈ నెలలో నిన్నటి వరకు మొత్తం 20.06 లక్షల గృహావసర ఎల్పీజీ సిలిండర్లను డెలివరీ చేశామనీ, ఈ సీజన్కు ఇది సాధారణమని ఓఎంసీలు తెలిపాయి. ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్, ఐవీఆర్ఎస్, ఆన్లైన్ వేదికల ద్వారా ఎల్పీజీ సిలిండర్లు బుక్ చేసుకోవాలని ఎల్పీజీ వినియోగదారులను కంపెనీలు ప్రోత్సహించాయి. ఎల్పీజీ సిలిండర్ల విషయంలో అక్రమాలను అరికట్టేందుకు, అసలైన లబ్ధిదారులకు అందేలా చూసేందుకు ఓటీపీ ఆధారిత సిలిండర్ డెలివరీ విధానమైన డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ) వ్యవస్థను అనుసరించాలని కోరుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం డీఏసీ విధానం 95 శాతానికి పైగా అమలవుతోంది. రాష్ట్రంలో డీఏసీ అమలు శాతాన్ని వంద శాతానికి చేర్చేందుకు ఓఎంసీలు, గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారుల సహకారాన్ని కోరుతున్నాయి. వదంతులను నమ్మి మోసపోవద్దని.. విశ్వసనీయ సంస్థలు అందించే వార్తలను మాత్రమే విశ్వసించాలని సామాన్య ప్రజలకు ఓఎంసీలు మరోసారి విజ్ఞప్తి చేశాయి.
ప్రజల్లో అనుమానాలు….
దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రలో, డీజీల్ కొరత ఉందన్న వార్తలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా పెట్రో ల్ బంకులు దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోలియం కంపెనీలు కొరత లేదని చెబుతున్నా….ప్రజల్లో అనుమానాలు మాత్రం పోవడం లేదు.











Leave a Reply