NewsInn

News in a Click

టీఆర్ఎస్ క‌విత దూకుడు… స‌ర్కార్ బ్రేకులు

టీఆర్ఎస్ క‌విత దూకుడు… స‌ర్కార్ బ్రేకులు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణా రాష్ట్ర స‌మితి అధినేత్రి క‌ల్వ‌కుంట్ల క‌విత‌ దూకుడుకు కాంగ్రెస్ స‌ర్కార్ బ్రేకులు వేస్తోంది. ఉద్య‌మం చేస్తామ‌న్న ప్ర‌క‌ట‌న‌ల‌తోనే ప్ర‌భుత్వం స్పందిస్తోంది. క‌విత లేవ‌నెత్తిన అంశాల‌ను ప‌రిష్క‌రిస్తామ‌న్న హామీలు స‌ర్కార్ఇస్తోంది. క‌విత తెలంగాణా జాగృతి పేరుతో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఫోక‌స్ పెట్టి….ఆ త‌రువాత టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి మ‌రింత దూకుడుగా ఆమె స్పందిస్తున్నారు. క‌విత లేవ‌నెత్తే అంశాల‌ను ప్ర‌భుత్వం కూడా సీరియ‌స్ గా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుంది. క‌విత డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించేందుకు సీఎం స‌హా, మంత్రులు కూడా ప్రాధాన్య‌త ఇస్తున్నారు. దీంతో క‌విత గురించి కొత్త రాజ‌కీయ‌ చ‌ర్చ మొద‌లైంది. టీఆర్ఎస్ క‌విత ప్ర‌శ్నిస్తోంది…ప్ర‌భుత్వం స్పందిస్తోంది. అన్న కొత్త చ‌ర్చ‌లు జోరందుకుంటున్నాయి. కీల‌క అంశాల‌పై ప్ర‌తిప‌క్ష పార్టీగా క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌శ్న‌లు సంధిస్తుండ‌డం… ప్ర‌భుత్వం స్పందిస్తుండ‌డం వేగంగా జ‌రిగిపోతున్నాయి. పాల‌మూరు రంగారెడ్డి ఎత్తి పోత‌ల ప‌థ‌కంపై పాల‌మూరు జిల్లా ఎమ్మెల్యేల‌తో భేటీ అయ్యారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అనుగుణంగా అనుస‌రించాల్సిన వ్యూహంపై చర్చించారు.

పాల‌మూరు ప్రాజెక్టు పూర్తి చేద్దాం….

గ‌తంలో క‌విత లేవ‌నెత్తిన అంశాల‌ను ప్ర‌భుత్వం రెండు వారాల్లోపే ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టింది. జాగృతి జ‌నం బాట పేరుతో ప‌లు జిల్లాల్లో క‌విత ప‌ర్య‌టించి ప‌లు స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తెచ్చారు. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో కూడా ప‌ర్య‌టించి ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించిన స‌మ‌యంలో కూడా ఆ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారం చూపేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. తాజాగా తెలంగాణ‌లో కీల‌క మైన సాగునీటి ప్రాజెక్టు గురించి క‌విత పాద‌యాత్ర చేస్తాన‌ని ల‌క్ష్మిదేవి ప‌ల్లి లో బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసి ప్ర‌క‌టించారు. .గ‌త ప్ర‌భుత్వం పాల‌మూరు ప్రాజెక్టును ఏమాత్రం ప‌ట్టించుకోలేద‌ని ఆరోపిస్తూ…. ఈ ప్ర‌భుత్వ‌మైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.. దీంతో సీఎం రేవంత్ రెడ్డి పాల‌మూరు జిల్లా నేత‌ల‌తో స‌మావేశం అయి సానుకూలంగా నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ అంశంపై క‌విత ట్వీట్ కూడా చేసింది. ప్ర‌శ్నిస్తే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌నేందుకు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. ప్రాజెక్టులో కీల‌క‌మైన 19,20,21 ప్యాకేజీ ప‌నుల‌ను పూర్త చేయాల‌ని, ల‌క్ష్మిదేవి ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ ప‌నులు మొద‌లు పెట్టే వ‌ర‌కు రైతుల ప‌క్షానే త‌మ పోరాటం ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు.

ఎక్స్ లో స్పందించిన క‌విత‌….

రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారిన బండి భ‌గీర‌థ్ పోక్సో కేసు విష‌యంలో క‌విత భిన్నంగా స్పందించారు. బండి సంజ‌య్ త‌న‌యుడు రాజ‌కీయాల్లో లేర‌ని ఆ అబ్బాయి గురించి స్పందించ‌డం భావ్యం కాద‌ని అంటూనే బాధిత మైన‌ర్ కు అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు. అయితే బండి భ‌గీర‌థ్ విదేశీల‌కు పారిపోకుండా లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం కూడా ఆ వెంట‌నే భ‌గీర‌థ్ పై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది.

ఇలా క‌ల్వ‌కుంట్ల క‌విత స్పందిస్తే…ఆ అంశం ఖ‌చ్చితంగా ప‌రిష్కారం చేసే దిశ‌గానే స‌ర్కార్ నిర్ణ‌యాలు ఉంటున్నాయి. ఇవి రెండు తాజా ఉదాహ‌ర‌ణ‌లు మాత్రమే. దీంతో కవిత క్షేత్ర స్థాయిలో మ‌రింత దూకుడుగా పోరాటం చేసేందుకు అవ‌కాశం లేకుండా స‌ర్కార్ చేస్తుంద‌న్న అనుమానాలు టీఆర్ఎస్ నేత‌ల్లో వ్య‌క్తం అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *