NewsInn

News in a Click

మరోసారి పేలిన పెట్రో బాంబు

(హైదరాబాద్,న్యూస్ఇన్)

కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రో బాంబు చేసింది. గత వారం రోజులుగా వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచుతూ వస్తున్నాయి. తాజా నిర్ణయం తో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. పెట్రోల్ పై రూ.2. 61 పైసలు, డీజిల్ పై రూ.2.71 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పెరిగిన ధరల ప్రకారం హైదరాబాదులో పెట్రోల్ ధర 116 రూపాయలకు చేరుకోగా డీజిల్ 101కి చేరుకుంది. కేంద్రం చొరవతో దేశంలో పెట్రోల్ కొరత లేదని, ముందుచూపు కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నా మన దేశంలో పెంచడం లేదని సామాన్యులపై బిజెపి నేతలు ప్రకటనలు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల పూర్తి కావడంతో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై కేంద్ర పెట్రోలియం శాఖ స్పందించి పెట్రోల్ ధరలు పెంచే ఆలోచన లేదని ప్రకటన చేసింది.కానీ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారానికి అనుగుణంగానే ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ధరల సవరణ జరుగుతూ ఉంది. వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 8 రూపాయల వరకు పెట్రోల్, డీజిల్ పై ధరలను చమురు సంస్థలు పెంచాయి.

ఈ ప్రభావం అన్ని రంగాలపై స్పష్టంగా కనిపించనుంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఉప్పు,పప్పు, నూనెలు,కూరగాయల ఇలా ఒక్కటేమిటి అన్నింటి పైన దీని ప్రభావం ఉంటుంది. ఎన్నికలు అయ్యేంతవరకు నష్టాలు భరించిన చమురు సంస్థలు ఇప్పుడు లాభాల బాటలోకి వచ్చే పనిలో పడ్డాయి. భారీగా పెరుగుతున్న పెట్రోల్ ధరలతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. రాబోయే రోజుల్లో పెట్రోల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం,డాలర్ మారకం విలువ తగ్గుతుండడం వంటి పరిణామాలు ధరల పెరుగుదలపై మరింత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది.అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ అయిన ధరలు భారీగా దిగివచ్చిన సమయంలో కూడా పెట్రోల్ ,డీజిల్ ధరలు తగ్గించిన సందర్భాలు పెద్దగా లేవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *