(అమరావతి, న్యూస్ఇన్)
రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు స్థానాల్లో 3 తెలుగుదేశం పార్టీకి, ఒకటి జనసేనకు కేటాయించిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్ణయం తీసుకున్నాయి.సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం జరిగిన ఎన్డీఏ మిత్ర పక్షాల సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలన, రాజ్యసభ సీట్ల కేటాయింపు అంశంపై ఎన్డీఏ పక్ష నేతలు చర్చించారు. అనేక సవాళ్లను ఎదుర్కొని ప్రభుత్వం సాధించిన విజయాలను గ్రామగ్రామాన ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. మూడు ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనపై ఎన్డీఏ తరపున చేపట్టే ప్రచార కార్యక్రమాలపై చర్చించారు.

9వ తేదీన తిరుపతి, 12వ తేదీన అమరావతి, 15వ తేదీన విశాఖలో బహిరంగ సభలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. తిరుపతిలో సంక్షేమం, అమరావతిలో సుపరిపాలన, విశాఖలో అభివృద్ధి అంశాలపై కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. మూడు పార్టీల అగ్ర నేతల సమావేశంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పైన చర్చ జరిగింది. ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు గానూ ఒకటి జనసేనకు 3 టీడీపీకి కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మూడు పార్టీల నేతల ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం జరిగింది. రాజ్యసభ సీట్ల కేటాయింపు విషయంలో ఎన్డీఏ పక్ష నేతలతో చర్చించిన అనంతరం ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు వెల్లడించారు. త్వరలోనే రాజ్యసభ అభ్యర్థులను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.







Leave a Reply