NewsInn

News in a Click

అక్రిడేష‌న్ల పై విచార‌ణ…. మొద‌లైన‌ వివాదం

అక్రిడేష‌న్ల పై విచార‌ణ…. మొద‌లైన‌ వివాదం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

అక్రిడేష‌న్ల కార్డుల ప్ర‌క్రియ‌లో అర్హుల‌కే అందేలా విచార‌ణ జ‌రిపించి అక్రిడేష‌న్ కార్డులు ఇస్తుండ‌డం కూడా రాష్ట్రంలో వివాదాస్ప‌దంగా మారుతోంది.ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం అక్రిడేష‌న్ కార్డుల‌ను జ‌ర్న‌లిస్టుల‌కు ఇవ్వ‌డంపై అభ్యంత‌రం కాదు. జ‌ర్న‌లిస్టుల గుర్తింపు కోసం ప్ర‌భుత్వాలు ఎన్నో ఏళ్ల నుంచి ఇస్తున్న అందిస్తున్న అక్రిడేష‌న్ల మంజూరీ విష‌యంలో గ‌తంలో ఎన్న‌డూ లేనంతగా ఈ ఏడాది వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్ర‌భుత్వ ప‌రంగా జ‌రుగుతున్న నిర్ల‌క్ష్య‌మా…శాఖ ఉన్న‌తాధికారుల‌కు అవ‌గాహ‌న లోపమా అన్న‌దానిపై ఎన్నో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అస‌లైన జ‌ర్నలిస్టులకు అన్యాయం జ‌రుగ‌ద‌ని సంబంధిత మంత్రి స్స‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌నలు చేస్తున్నారు. ఇది ఆహ్వానించ ద‌గ్గ ప‌రిణామమే. అయితే ఇదే స‌మ‌యంలో అక్ర‌మంగా అక్రిడేష‌న్ కార్డులు పొందుతున్న వారి ప‌రిస్థితి ఏమిట‌న్న‌దానిపై ప్ర‌భుత్వానికి స్ప‌ష్ట‌త లేదు…. సంబంధిత శాఖ‌కు అంత‌కన్నా అవ‌గాహ‌న ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అధికంగా అక్రిడేష‌న్ కార్డులు ఇస్తున్నామ‌న్న గొప్పులు చెప్పుకునేందుకు త‌ప్ప‌…..ఈ కార్డులు పొందుతున్న వారిలో ఎంత మంది అర్హులు, ఎంత మంది అన‌ర్హులు అన్న విష‌యంపై ప్ర‌భుత్వం గాని సంబంధిత శాఖ గాని ఎప్పుడూ ఆరా తీసిన సంద‌ర్భాలు లేవు. కాంగ్రెస్ స‌ర్కార్ రాష్ట్రంలో ఏర్పాటైన స‌గం కాలం పూర్త‌యిన త‌రువాత అక్రిడేష‌న్ కార్డులు ఇచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకుంటే ముందు నుంచి ఈ వ్య‌వ‌హారంపై వివాదాలే చుట్ట‌ముడుతున్నాయి. ఈ కార్డుల వ్య‌వ‌హారాన్ని స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌లేద‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఐ అండ్ పీఆర్ క‌మిష‌నర్ పై కూడా బ‌దిలీ వేటు ప‌డింద‌న్న ప్ర‌చారం ఉంది. ఐఏఎస్ అధికారిని ఆ స్థానం నుంచి త‌ప్పించి మ‌రో సీనియ‌ర్ అధికారికి స్పెష‌ల్ క‌మిష‌న‌ర్ గా బాధ్య‌తలు స‌ర్కార్ అప్ప‌గించింది. అయినా….వివాదాలు ఇంకా వీడ‌డం లేదు.

న‌కిలీల‌కు సులువు…..

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అక్రిడేష‌న్ కార్డులు పొందేందుకు కొంత మంది అస‌లైన జ‌ర్న‌లిస్టుల‌కు కూడా నిబంధ‌న‌లు అడ్డు వ‌స్తుండ‌గా… అర్హ‌త లేని వారు ఎంతో మంది సులువుగా కార్డులు పొందుతున్నారు. కొన్ని జిల్లాల్లో ప్ర‌భుత్వ ఉద్యోగులు కూడా అక్రిడేష‌న్ కార్డుల‌కు ధ‌ర‌ఖాస్తు చేసుకుంటే సంబంధిత జిల్లా పౌర సంబంధాల అధికారులు హెచ్చ‌రిక‌లు చేసే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది. మ‌రి కొన్ని జిల్లాల్లో ప్ర‌జా ప్ర‌తినిధులు, డ్రైవ‌ర్ వృత్తిలో ఉన్న వారు, కుల వృత్తులు చేసుకునే వారు కూడా అక్రిడేష‌న్ కార్డులు పొంద‌డం జ‌రిగింది. జ‌ర్న‌లిస్టులుగా విధులు నిర్వ‌హిస్తూ కార్డు పొందితే త‌ప్పు లేదు. కానీ ఎలాంటి అనుభ‌వం లేకున్నా..మీడియా సంస్థ‌ల‌తో ఒప్పందాలు చేసుకుంటూ సులువుగా అక్రిడేష‌న్ కార్డులు పొందుతున్నారు. ఇది బ‌హిరంగ ర‌హస్యం ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే ప్ర‌భుత్వ‌మే క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

జ‌ర్న‌లిజంతో సంబంధం లేని వారికి అక్రిడేష‌న్లు అంద‌రాదంటే ఒప్పందాలు చేసుకుని అక్రిడేష‌న్ కార్డుల జాబితాలు ఇచ్చే సంస్థ‌ల‌పై ప్ర‌భుత్వం నిఘా పెట్టాలి…ఆయా సంస్థ‌ల తీరును ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మాత్ర‌మే అక్రిడేష‌న్ కార్డులు అందేలా చ‌ర్య‌లు తీసుకోవాలి లేదంటే…. ఆయా సంస్థ‌లు స‌మ‌ర్పించిన జాబితా పై ఎస్బీ విచార‌ణ జ‌రిపించి జ‌ర్న‌లిజం వృత్తి లో లేకుండా అక్రిడేష‌న్ కార్డు పొంది ఉంటే వారిపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. దీనికి తోడు కి అక్రిడేష‌న్లు ఇవ్వాల‌ని జాబితాను సిఫార‌సు చేస్తున్న మీడియా సంస్థ‌ల‌ను ప్ర‌భుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టే విధంగా దృష్టి సారించాల‌న్న వాద‌న వినిపిస్తోంది.

విచార‌ణ వివాదం….

అన‌ర్హుల‌కు అక్రిడేష‌న్ కార్డులు ద‌క్క‌రాద‌న్న అభిప్రాయంతో జ‌న‌గాం జిల్లా క‌లెక్ట‌ర్ తీసుకున్న నిర్ణ‌యం పై జ‌ర్న‌లిస్టు సంఘాలు మంత్రికి ఫిర్యాదు చేయ‌డం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అర్హుల‌కు ఇవ్వాల‌న్న సంఘం…ఇప్పుడు ఆ క‌లెక్ట‌ర్ ఎస్పీ విచార‌ణ చేసి అక్రిడేష‌న్ల‌కు ఆమోదం తెల‌ప‌డాన్ని త‌ప్పు బ‌ట్ట‌డం వెనుక ఉన్న అంత‌ర్యం ఏమిటో అంతు చిక్క‌డం లేదు. అర్హుల‌కు కార్డులు ఇచ్చేందుకు ప్ర‌భుత్వంపై వ‌త్తిడి తెస్తే బాగుంటుంది. కానీ పోలీసు విచార‌ణ జ‌రిపించి అర్హులైన జ‌ర్న‌లిస్టుల‌ను ఖ‌రారు చేస్తున్న క‌లెక్ట‌ర్ వ్య‌వ‌హ‌రాన్ని ట‌ త‌ప్పుబడుతుండ‌డం దేనికి సంకేతామో అంతు చిక్క‌డం లేదు. క‌లెక్ట‌ర్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించాల్సిన సంఘాలు అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డం వెనుక రాజ‌కీయ కార‌ణాల లేదంటే….. మ‌రేదైనా కార‌ణ‌మా అన్న‌ది అంతు చిక్కడం లేదు.

రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేయాలి…

అర్హులైన జ‌ర్న‌లిస్టుల‌ను మాత్ర‌మే అక్రిడేష‌న్ కార్డులు అందేలా క‌లెక్ట‌ర్ అమ‌లు చేస్తున్న విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేయాల‌న్న అభిప్రాయం కూడా ఉంది. ప్ర‌భుత్వం ఆ జిల్లాను ప్ర‌యోగత్మ‌కంగా ప‌రిశీలించి ఇత‌ర జిల్లాల్లో కూడా ఇదే విధానాన్ని అమ‌లు చేయాల‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వ ప‌రంగా ఒక్క ఏడాది క‌ఠినంగా ఇలాంటి నిర్ణ‌యాల‌ను అమ‌లు చేస్తే రాబోయే రోజుల్లో న‌కిలీ జ‌ర్న‌లిస్టులు, అన‌ర్హుల‌కు అక్రిడేష‌న్ కార్డులు అంద‌డం దాదాపు అసాధ్యంగా మారుతోంది. అక్రిడేష‌న్ కార్డులు మంజూరు చేసిన త‌రువాత కూడా ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రిపించి అన‌ర్హులు కార్డులు పొంది ఉంటే…వారి కార్డుల‌ను ర‌ద్దు చేసి చ‌ర్య‌లు తీసుకుంటే…. న‌కిలీలకు అడ్డుక‌ట్ట వేసే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతోంది. ఏపీలో కూడా ప‌లువురు జిల్లా క‌లెక్ట‌ర్లు విచార‌ణ జ‌రిపిన అనంత‌ర‌మే కార్డులు మంజూరు చేశారు. వేలాది కార్డులు ఇచ్చామ‌ని చెప్పుకునే గొప్ప‌ల కంటే…. అర్హులైన వారంద‌రికీ అక్రిడేష‌న్లు ఇచ్చే బాధ్య‌త ప్ర‌భుత్వంపైనే ఉంటుంది. ప్ర‌భుత్వం ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తే… మ‌రో రెండేళ్ల‌ త‌రువాత కూడా మ‌రింత మంది న‌కిలీ జ‌ర్న‌లిస్టులు సులువుగా పుట్టుకుచ్చే అవ‌కాశం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *