(హైదరాబాద్,న్యూస్ఇన్)
నకిలీ జర్నలిస్టులుగా ప్రభుత్వ ఉద్యోగులు అవతారం ఎత్తుతున్నారు. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడేషన్ కార్డులను పొందేందుకు పలువురు ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తించారు. ఎంతో మంది అనర్హులు కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నా…. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వంలో ఉద్యోగులుగా కొనసాగుతున్న వారు దరఖాస్తు చేసుకోవడం విడ్డూరంగా కనిపిస్తోంది.
దాదాపు రెండున్నరేళ్ల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. గత రెండు,మూడు నెలలుగా ఎన్నో వివాదాలు అక్రిడేషన్ కార్డుల చుట్టూ తిరిగినా… ప్రభుత్వం కార్డులు ఇవ్వాలన్న ఖచ్చితమైన నిర్ణయంతో కార్డులను ఇవ్వడం మొదలు పెట్టింది. అయితే అక్రిడేషన్ కార్డులు అనర్హులకు అందుతున్నాయన్న సమాచారం జిల్లా పౌరసంబంధాల శాఖాధికారులు కొన్ని జిల్లాల్లో గుర్తించారు. కొన్ని జిల్లాల్లో వారికి ఫిర్యాదులు కూడా అందాయి. ప్రభుత్వం కఠిన మైన నిబంధనలు విధించినా… అనర్హులు దరఖాస్తు చేసుకోవడం మరోసారి తీవ్ర చర్చకు దారి తీస్తోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది.
మేడ్చల్ లో హెచ్చరిక…..

మేడ్చల్ జిల్లాలో అక్రిడేషన్ కార్డు కొరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారిలో మండలాల్లో వివిధ పత్రికల్లో పనిచేస్తున్నట్లు పలువురు అనర్హులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు పలు ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్నారని డీపీఆర్వో గురించారు. ప్రభుత్వ సంస్థలలో, ప్రభుత్వ శాఖల్లో పని చేస్తూ రిపోర్టర్ గా అప్లై చేసిన వారి పై ప్రభుత్వం చీటింగ్ కింద కేసులు నమోదు చేస్తుందని డీపీఆర్వో ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలో కానీ ప్రభుత్వ శాఖల్లో కానీ పనిచేస్తున్న వారు స్వచ్ఛందంగా తమ దరఖాస్తులను రద్దు చేసుకోవాలని సూచించారు.

ఈ పరిస్థితుల్లో అనర్హులు తమ ధరఖాస్తులను రద్దు చేసుకోకపోతే కలెక్టర్ అనుమతి పొంది కేసులు నమోదుకు వెనుకడుగు వేయమని మేడ్చల్ డీపీఆర్వో హెచరించారు. పాలమూరు జిల్లాలో కొంత మంది సర్పంచ్ లు సహా ప్రతినిధులు కూడా అక్రిడేషన్లకు ధరఖాస్తులు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు డ్రైవర్లు,ప్రైవేటు ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో ఉన్న ఈ పరిస్థితులను అధిగమించాలంటే ప్రభుత్వం ఇప్పటికైనా కఠినంగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే ఈ కార్డులతో అనర్హుల వ్యవహారంతో అసలు జర్నలిస్టులకు క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. జర్నలిజం వృత్తిలో ఏళ్లుగా కొనసాగుతున్నా… ప్రభుత్వ నిబందనలతో కొంత మందికి కార్డులు అందని పరిస్థితి ప్రస్తుతం ఉంది. కానీ అమ్యామ్యాలతో కొంత మంది అనర్హులు దరఖాస్తులు చేసుకుంటుండంతో ప్రభుత్వ నిబందనల కారణంగా వారికి కార్డులు ఇవ్వక తప్పని పరిస్థితి ప్రస్తుతం ఉంది.
..

ఇప్పటికైనా ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి అనర్హుల కార్డులు రద్దు చేయడం, వారిపై కేసులు నమోదు చేయడం లాంటి కఠిన నిర్ణయాలను అమలు చేస్తే….. తప్ప అనర్హులకు అక్రిడేషన్ కార్డులు అందకుండా అడ్డుకట్ట వేసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సంఖ్యా పరంగా వేలాది కార్డులు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా…అర్హులు, అనర్హులు ఎవరనేది తేల్చాల్సిన బాద్యత కూడా ప్రభుత్వంపైనే ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న విధానంతో పాటు పోలీసు విచారణ చేసి కార్డులు మంజూరు చేయడం లేదా రద్దు చేయడం, అనర్హులపై కేసులు నమోదు చేయడం మొదలు పెడితే…. వచ్చే సారికైనా అనర్హులకు అక్రడేషన్ కార్డులు అందకుండా చేసే అవకాశం ఉంటుంది. అనర్హులకు అక్రిడేషన్ కార్డులు ఇచ్చేందుకు సిఫారసు చేస్తున్న సంస్థలపై కూడా ప్రభుత్వం చర్యలు చేపడితే సగానికి పైగా అనర్హులకు అక్కడే చెక్ పడుతుంది.ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇది సాధ్యం సాధ్యం కాదు.









Leave a Reply