(తిరుమల, న్యూస్ఇన్)
తమిళనాడులో రెండు రోజుల పాటు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్తో పలు కీలక ప్రాంతాలను ఎన్డీఏ తరపున ప్రచారం చేశారు. సోమ, మంగళవారాల్లో కోయంబత్తూర్, కృష్ణగిరి, విరుద్ నగర్, మధురై, చెన్నై జిల్లాల్లో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలు, రోడ్ షోలు, స్థానిక వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు కూడగట్టారు. కోయంబత్తూర్ నార్త్, కోయంబత్తూర్ సౌత్, సింగనల్లూర్, కౌండం పాలాయం, సూలూర్, థలి, అన్నా నగర్, టీ నగర్, విల్లివాక్కం, సాత్తూర్, కోవెల్పట్టి నియోజకవర్గాల ఎన్డీఏ అభ్యర్థులు ఏపీ సీఎం నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్నారు.

ఈ ప్రచారంలో ముఖ్యంగా అభివృద్ధిలో తమిళనాడు వెనుకబాటు, అవినీతి, క్షీణించిన శాంతి భద్రతలు వంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు. అలాగే తమిళనాడుకు ఎన్డీఏ అవసరాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సాధిస్తున్నామని, అదే విధంగా ఎన్డీఏకు అవకాశం ఇస్తే తమిళనాడు కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి ఆయా సభల్లో వివరించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్ సహా వివిధ ప్రముఖ కంపెనీల నుంచి వచ్చే పెట్టుబడులకు కేంద్రం ఇస్తున్న చేయూతే కారణమని ముఖ్యమంత్రి వివరించారు. తమిళనాడుకు పునర్ వైభవం రావాలంటే ఎన్డీఏకే సాధ్యమవుతుందని ప్రతీసభలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య నిత్యం ఉండే నీటి తగాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే నదుల అనుసంధానమే మార్గమనే అంశాన్ని ఏపీ సీఎం వివరించారు.
రెండు రోజుల ప్రచారం నిర్వహించిన బాబు….

మహిళా రిజర్వేషన్ బిల్లు, డిలిమిటేషన్ అంశాలపై డీఎంకే వైఖరిని తీవ్రంగా విమర్శించిన ఏపీ సీఎం… మహిళలకు అన్యాయం చేసిన పార్టీలను ప్రజలు తిరస్కరించాలన్నారు. మహిళలను ఓడించిన డీఎంకేను ఓడించాలంటూ తమిళ ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రతి సభలోనూ తమిళంలో మాట్లాడి ప్రజలను ఆకట్టుకున్న సీఎం చంద్రబాబు…. స్థానిక భావోద్వేగాలను గౌరవిస్తూ ప్రచారం నిర్వహించారు.







Leave a Reply