(హైదరాబాద్,న్యూస్ఇన్)
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఆగస్టు 6న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సోమవారం బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ ఆఫీస్ లో నిర్వహించిన పార్టీ బీసీ నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సంకల్పం తీసుకుంటామని తెలిపారు. ‘‘సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ’’ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. బీసీలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల వారిని ఒక్కతాటిపైకి తీసువచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామన్నారు. ముందు భౌగోళిక తెలంగాణ సాధించుకుందాం..

ఆ తర్వాత సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం పాటు పడుదామన్న ప్రొఫెసర్ జయశంకర్ గారి సూచనల మేరకు తాము 50 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పాటు పడుతున్నామని తెలిపారు. జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జాగృతి, టీఆర్ఎస్ రెండేళ్లుగా ప్రజాక్షేత్రంలో పని చేస్తున్నాయని గుర్తు చేశారు.ఆగస్టు 6 జయశంకర్ జయంతిని టీఆర్ఎస్ పార్టీ సామాజిక న్యాయ తెలంగాణ దినోత్సవంగా నిర్వహిస్తుందని తెలిపారు. తాము చేసిన ఉద్యమాలకు తలొగ్గే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా రెండు వేర్వేరు బిల్లులు అసెంబ్లీ, కౌన్సిల్ లో పాస్ చేసి కేంద్రానికి పంపిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లులకు ఆమోదం తెలిపేలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస ప్రయత్నాలు కూడా చేయడం లేదని ఆరోపించారు.












Leave a Reply